మృత్యువుతో పోరాడుతున్న ఉన్నావ్ బాధితురాలు .. 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్న వైద్యులు
ఉన్నావ్ : రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి పరిస్థితి సీరియస్గా ఉంది. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని, శరీరంలో చాలా చోట్ల ఎముకలు విరిగాయని వైద్యులు చెప్తున్నారు. ఆమెకు వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని .. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమని వైద్యులు స్పష్టంచేశారు. దీంతో ఆమె తల్లి .. తన కూతురు కోలుకోవాలని ఆ భగవంతుడిని వేడుకుంటుంది. ఆమెకు ఈ పరిస్థితికి గురిచేసిన సెంగార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.
బీజేపీ స్పందించింది.. ఉన్నావ్ కేసులో ఎమ్మెల్యే సస్పెన్షన్... నేరుం రుజువైతే కఠిన చర్యలని వార్నింగ్
మృత్యువుతో పోరాటం
ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలు చావుతో పోరాడుతున్నారు. రాయ్ బరేలిలో ఉన్న బంధువులను చూసేందుకు వెళ్తుండగా ట్రక్కురూపంలో మృత్యువు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఇద్దరు చనిపోగా .. బాధితురాలు, లాయర్ మృత్యువుతో పోరాటమే చేస్తున్నారు. ఆమెను మెరుగైన వైద్యం కోసం లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ వర్సిటీ ట్రామా సెంటర్కు తరలించారు. ఆమెకు 40 గంటల నుంచి వైద్యం అందిస్తున్న శరీరం స్పందించడం లేదు. వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. మరో 48 గంటలు గడిస్తే తప్ప ఏం చెప్పలేమని పేర్కొన్నారు.
విరిగిన పక్కటెముకలు
ట్రక్కు ప్రమాదంలో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. పక్కటెములు విరిగాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తం కారుతుందని వైద్యులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నామని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత ఆమె సృహలో లేరని .. కాలిలో వివిధ చోట్ల ఎముకలు విరిగిపోయినట్టు వైద్యులు తెలిపారు. ఊపిరితిత్తులు పనిచేసేందుకు కృత్రిమ ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. వెంటిలేటర్ లేకుంటే ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టపడుతున్నారని వివరించారు.
ఎమ్మెల్యేపై సస్పెన్షన్ వేటు
మరోవైపు ఉన్నావ్ లైంగికదాడి బాధితురాలి ప్రమాదంపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్పై సర్వత్రా విమర్శలు రావడంతో ఆ పార్టీ స్పందించింది. ఈ కేసును ఇప్పటికే సీబీఐకి అప్పగించిన యూపీ బీజేపీ సర్కార్ .. తాజాగా సెంగార్పై సస్పెన్షన్ వేటు వేసింది. లైంగికదాడి బాధితురాలి ప్రమాదానికి సెంగారే కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ క్రమంలో సెంగార్పై చర్యలు తీసుకోవాలని విపక్షాలు ముక్తకంఠంతో డిమాండ్ చేశాయి. దీంతో బీజేపీ హైకమాండ్ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉన్నావ్ లైంగికదాడి గురించి గతేడాదే బీజేపీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపిందని తెలిపారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేశ్ త్రిపాఠి. దాంతో అతనిపై చర్యలు తీసుకున్నామని వివరించారు. అప్పుడు నోటీసులు ఇచ్చి .. తర్వాత పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు పేర్కొన్నారు. అంతేకాదు బాధితురాలిపై లైంగికదాడి చేసినట్టు విచారణలో తేలిన, యువతి కారు ప్రమాదానికి కారణం సెంగార్ అని తెలిసినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. తమ పార్టీలో తప్పుచేసినవారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.