కుమ్ములాట షురూ: ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సరే...మరి సీఎం అభ్యర్థి ఎవరు..?
ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించింది. అక్కడ ప్రజలు ఏకపక్షమైన తీర్పునిచ్చారు. దీంతో బీజేపీ అడ్రస్సు గల్లంతైంది. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఛత్తీస్గడ్లో కాంగ్రెస్ 15 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారో సస్పెన్స్గా మారింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేసులో కాంగ్రెస్ పార్టీ ఛీఫ్ భూపేష్ బగేల్, రద్దయిన అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న టీఎస్ సింగ్ దేవ్, ఛత్తీస్గఢ్ నుంచి ఉన్న ఏకైక కాంగ్రెస్ ఎంపీ తమ్రాద్వాజ్ సాహూలు ఉన్నారు.
గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టిన భూపేష్ భగేల్
ముగ్గురు ముఖ్యమంత్రులుగా తమనే ఎందుకు ఎన్నుకోవాలో అనేదానిపై కారణాలు కూడా చూపిస్తున్నారు. అయితే హైకమాండ్ మాత్రం ఎవరికి సీఎం బాధ్యతలు అప్పగించినా... 2019 లోక్సభ ఎన్నికలకు గ్రౌండ్లెవెల్లో క్యాడర్ను సంసిద్ధత చేయాలని ఆదేశిస్తోంది. శాసనసభాపక్షనేతను కాంగ్రెస్ సంప్రదాయ పద్దతిలో ఎన్నుకుంటుందని ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ ఇంఛార్జ్ పీఎల్ పూనియా చెప్పారు. అందరి కష్టంతోనే పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆయన కొనియాడారు.
గ్రూపులుగా విడిపోయిన వారిని ఒకే తాటికిందకు తీసుకురావడంలో భగేల్ సక్సెస్ అయ్యారు. అంతేకాదు ప్రచారంలో కూడా ప్రత్యర్థుల బలహీనతను బయటపెట్టడంలో సక్సెస్ అయ్యారు. అజిత్ జోగి కాంగ్రెస్ పార్టీని వీడాకా ఆయన వర్గాన్ని బయటకు పంపడంలో కీలక పాత్ర పోషించారు భగేల్. అయితే ఎన్నికలకు కొద్దిరోజుల ముందు పూనియాతో విబేధించిన కారణంగా ఆయనకు కొంత మైనస్గా మారే అవకాశం ఉంది. కొన్ని వీడియోలు కూడా లీక్ అవడం అందులో భగేల్ కాంగ్రెస్ నేతల గురించి మాట్లాడటం వంటివి ఈయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.
కాంగ్రెస్ మేనిఫెస్టో వెనక మాస్టర్ బ్రెయిన్ టీఎస్ సింగ్ దేవ్
ఇక ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ మేనిఫెస్టో రూపొందించడం వెనక ఉన్న మాస్టర్ బ్రెయిన్ టీఎస్ సింగ్ దేవ్. అంతేకాదు ప్రచారం సందర్భంగా ఫండ్స్ ఏర్పాటు చేయడం ఇతర వనరులు ఏర్పాటు చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కూడా చాలా దగ్గర వ్యక్తి కావడంతో ఆయన పేరు కూడా సీఎం పోస్టుకు వినిపిస్తోంది. అయితే రాజకుటుంబానికి చెందినవాడు కావడం ఆయనకు కాస్త ప్రతికూలంగా పరిణమించే అంశం. ఎందుకంటే ఇప్పటికే ఓ రాష్ట్రానికి రాజకుటుంబానికి చెందిన వ్యక్తిని కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా నియమించింది. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి.
కింది స్థాయి నుంచి ఎదిగి పలు పదవులను చేపట్టిన సాహూ
ఇక చివరిగా సాహూ. ఈయన కూడా పంజాబ్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. సాహూ ఓబీసీ వర్గానికి చెందినవారు. ఈయన్ను ముఖ్యమంత్రిని చేస్తే బీసీ సామాజిక వర్గాలను ఒక్కతాటికిందకు వస్తారు. తద్వారా 2019 ఎన్నికల్లో బీసీ ఓటు బ్యాంకు కాంగ్రెస్కు మల్లే అవకాశం ఉంది. సాహూ సర్పంచ్ కావడం నుంచి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. అక్కడి నుంచి చిన్నగా ఎదుగుతూ పలు పదవులను అధిష్టించారు. గ్రామ ప్రెసిడెంటు నుంచి జిల్లా ప్రెసిడెంటు ఆ తర్వాత పార్టీలో పలు పదవులు నిర్వహించారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఓ సారి మంత్రగా చేసిన అనుభవం కూడా సాహూకు ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ సాహూను ఓబీసీ సెల్ అధ్యక్షుడిగా కూడా ఈ ఏడాది నియమించింది. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ప్రమోట్ అయ్యారు. అయితే తనకంటూ వ్యక్తిగతంగా ఎలాంటి కోరికలు లేవని హైకమాండ్ తనకు ఏది అప్పగించినా బాధ్యతతో పూర్తిచేస్తానని సాహూ చెప్పారు.
ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికలకు ఎవరైతే పార్టీని సమాయత్తం చేయగలరని పార్టీ నమ్ముతుందో వారినే ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ హైకమాండ్ నియమిస్తుందని ఓ సీనియర్ నేత చెప్పారు.