కాంగ్రెస్ తరపున నేను క్షమాపణ కోరుతున్నా: ఆ ఉద్యోగులతో మోడీ
ఢిల్లీ: 'చౌకీదార్ చోర్ హై' కాపలాదారుడే దొంగ అని ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు ప్రధాని నరేంద్ర మోడీ. కాంగ్రెస్ చేస్తున్న ప్రచారం దేశవ్యాప్తంగా ఉన్న చౌకీదార్లను అవమానపరిచేలా ఉందని ధ్వజమెత్తారు. వారసత్వ పార్టీ లక్ష్యం దేశంలో విద్యేషాన్ని పెంచిపోషించడమే అన్నట్లుగా ఉందని కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు ప్రధాని మోడీ. బుధవారం సాయంత్రం దేశవ్యాప్తంగా 25లక్షల మంది చౌకీదార్ల సమావేశంలో రేడియో ద్వారా ప్రసంగించారు.
సంఝౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసు: అసీమానందతో సహా అందరినీ నిర్దోషులుగా ప్రకటించిన ఎన్ఐఏ కోర్టు
కాంగ్రెస్ చౌకీదార్లను అవమానించింది..క్షమించండి
తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించే క్రమంలో కాంగ్రెస్ వాచ్మెన్లు అందరినీ అవమానపరుస్తోందని అన్నారు ప్రధాని. పైగా తాను చౌకీదార్లను అవమానిస్తున్నానని తప్పుడు సంకేతాలు పంపుతోందని దుయ్యబట్టారు. ఇలా వాచ్మెన్ పేరుతో తనపై ఆరోపణలు చేస్తే దేశంలోని చౌకీదార్ల నుంచి వ్యతిరేకత తీసుకొచ్చి వాటిని ఓట్లుగా మరల్చుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని మోడీ అన్నారు. చౌకీదార్ అనే పదంపై తప్పుడు సంకేతాలు పంపిన వారి తరపునుంచి తాను క్షమాపణ కోరుతున్నట్లు మోడీ చెప్పారు. అది కేవలం వారి స్వప్రయోజనాల కోసమే చౌకీదార్ పదాన్ని భ్రష్టు పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. వారి మాటలకు చౌకీదార్లు మనస్సులు బాధపడి ఉంటే క్షమించాల్సిందిగా తాను అడుగుతున్నట్లు మోడీ చెప్పారు.
నాకు చౌకీదారే స్ఫూర్తి
"కాంగ్రెస్ వారసత్వ పార్టీ. దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోంది. వారు ఎలాగూ పనిచేయరు.. పనిచేసే వాడిని పనిచేయనివ్వరు. కష్టపడి పనిచేసేవాడు దేశానికి ప్రధాని అయితే ఓర్వలేకున్నారు. ఈ దూషణలు ఇక్కడితో ఆగవు. భవిష్యత్తులో కూడా నాపై ఆరోపణలు తప్పుడు మాటలను ప్రచారం చేస్తారు" అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కాంగ్రెస్ లేదా విపక్షాలు తనపై కానీ చౌకీదార్ గురించి కానీ ఎన్ని విమర్శలు చేసినా భయపడొద్దని దేశవ్యాప్తంగా ఉన్న చౌకీదార్లకు పిలుపు ఇచ్చారు ప్రధాని మోడీ. దూషణలను ఆశీర్వాదాలుగా మలుచుకోండంటూ ప్రధాని చెప్పారు.
ఇక మై భీ చౌకీదార్ ప్రచారం గురించి అంతా వినే ఉంటారన్న ప్రధాని ... ఈ రోజుల్లో చౌకీదార్ పదం ఎక్కువగా దేశంలో వినిపిస్తోందన్నారు. దేశ విదేశాల్లో, టీవీల్లో సోషల్ మీడియాలో ఈ పేరు వినిపిస్తోందని చెప్పిన ప్రధాని ప్రతి భారతీయుడు తాను కూడా కాపలాదారుడే అని గర్వంగా చెప్పుకుంటున్నాడని వెల్లడించారు. ఎలాంటి వాతావరణంలో నైనా భద్రత లేనప్పటికీ కూడా తన డ్యూటీ చేస్తున్న వాచ్మెన్లను ప్రధాని అభినందించారు. చౌకీదార్పట్ల తనకు గౌరవం ఉందన్న ప్రధాని మోడీ ఈరోజు దేశవ్యాప్తంగా చౌకీదార్ ప్రచారం జోరుగా జరుగుతోందంటే అది వారిని స్ఫూర్తిగా తీసుకోవడంతోనే అయ్యిందన్నారు.
పాకిస్తాన్లో దాడులు జరిగితే భారత్లో కొందరు బాధపడుతున్నారు
అవినీతికి పాల్పడే వారిని సహించేదే లేదన్న ప్రధాని ... తన బాధ్యత కూడా ఒక వాచ్మెన్లానే ఉంటుందని చెప్పారు. ఒక కాపలాదారుడు లేకపోతే కొందరు దేశాన్ని నాశనం చేసేందుకు తయారవుతారని చెప్పిన ప్రధాని .... చౌకీదార్లా ఓ కన్నేసి ఉంచితే ఇలాంటి తప్పులను చేసేందుకు భయపడుతారని వెల్లడించారు. కాంగ్రెస్ వాచ్మెన్ను గౌరవించి ఉంటే దేశం నుంచి పెద్ద ఎత్తున డబ్బులు విదేశాలకు తరలి వెళ్లేవి కాదని అభిప్రాయపడ్డారు. ఆ డబ్బులు ఇక్కడ ప్రజలకు ఉపయోగంగా మారేదని చెప్పారు. ఇక బాలాకోట్ దాడులపై మాట్లాడిన ప్రధాని... కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. భారత బలగాలు తమ ప్రాణాలను దేశం కోసం త్యాగం చేయడంపై ప్రతిఒక్కరూ గర్వపడాలని చెప్పిన ప్రధాని... ఈ చిన్న చిన్న గ్యాంగులు మాత్రం పాకిస్తాన్పై మన బలగాలు దాడులు చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాయన్నారు. పాకిస్తాన్పై బాంబులు విసిరినప్పుడు పాకిస్తాన్లో బాంబు దాడి జరిగితే భారత్లో కొందరు చాలా ఇబ్బంది పడుతున్నారని అన్నారని మోడీ కాంగ్రెస్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.