‘వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించలేం’
న్యూఢిల్లీ: వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే చట్టం చేయాలన్న ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి మేనకా గాంధీ స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో మాదిరిగా మన దేశంలో దీనిని నేరంగా పరిగణించడం సాధ్యం కాదని మేనకా గాంధీ పార్లమెంటుకు లిఖితపూర్వకంగా తెలిపారు.
మన దేశంలో పేదరికం, నిరక్షరాస్యత, వివిధ సాంఘిక ఆచారాలు, విలువలు, మత విశ్వాసాల వల్ల వివాహాన్ని పవిత్రంగా భావిస్తారన్నారు. అందువల్ల వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించే చట్టాన్ని చేయడం సాధ్యం కాదన్నారు.
అంగీకార శరీరక సంబంధం రేప్ కాదు: హైకోర్టు
పరస్పర అంగీకారంతో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం అత్యాచార పరిధిలోకి రాదని బొంబాయి హైకోర్టు స్పష్టం చేసింది. భాగస్వామితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండటం వల్ల ఎదురయ్యే పరిణామాలను అర్థం చేసుకునే పరిపక్వత విద్యావంతురాలైన స్త్రీకి ఉంటుందని వ్యాఖ్యానించింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ తనపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ కోసం ఓ యువకుడు చేసుకున్న దరఖాస్తుపై విచారణ సందర్భంగా హైకోర్టు గురువారం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
శోలాపుర్కు చెందిన 25 ఏళ్ల యువకుడు, ముంబైకి చెందిన 24ఏళ్ల యువతి నిరుడు మార్చిలో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకుంటానంటూ నమ్మబలికి ఆమెతో సదరు యువకుడు శారీరక సంబంధం పెట్టుకున్నట్లు యువతి తరఫు న్యాయవాది వాదించారు. అనంతరం యువతి గర్భవతి కావడంతో బలవంతంగా గర్భస్రావం చేయించి... ఆమెతో సంబంధాలను పూర్తిగా తెంచుకున్నాడని ఆరోపించారు.
ఎట్టిపరిస్థితుల్లోనూ అతడికి బెయిల్ మంజూరు చేయకూడదని సూచించారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ మృదులా భట్కర్ స్పందిస్తూ... పాశ్చాత్య సంస్కృతిని పరిగణనలోకి తీసుకుంటే పరస్పర అంగీకారంతోనే సదరు యువతీ యువకులు శారీరక సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోందన్నారు. తాజా కేసు అత్యాచార పరిధిలోకి రాదని పేర్కొంటూ... యువకుడికి బెయిల్ మంజూరు చేశారు.