ఇంత దారుణమా?: మహిళా కార్పోరేటర్ జుట్టు పట్టి.. చీర లాగిన కాంగ్రెస్ నేతలు..
తనకు మాట్లాడాల్సిందిగా అవకాశం కల్పించాలని మంజులా నారాయణస్వామి కోరడంతో.. ఆమెను అడ్డుకోవడమే కాకుండా జుట్టు, చీర పట్టుకుని లాగారు.
బెంగళూరు: బెంగుళూరుకు చెందిన ఓ కార్పోరేటర్ ను కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అవమానించారు. ఓ అభివృద్ది కార్యక్రమానికి శంకుస్థాపన సందర్భంగా ఒక మహిళా కార్పోరేటర్ పట్ల దిగజారుడు వైఖరిని ప్రదర్శించారు. అందరు చూస్తుండగానే ఆమె చీర లాగి.. జుట్టు పట్టుకుని రచ్చ చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. రాజరాజేశ్వరినగర నియోజకవర్గంలోని లగ్గెరె వార్డు పరిధిలో గల రాక్షసహళ్లిలో సీఎం నగరోత్థాన పథకం కింద బృహత్ నీటికాలువ పనుల ప్రారంభానికి సీఎం సిద్దరామయ్య శుక్రవారం వచ్చారు. అయితే అదే వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పోరేటర్ మంజులా నారాయణస్వామికి మాత్రం దీని గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.

సిద్దరామయ్య వస్తున్నట్లు గానీ, నీటికాలువ పనుల శంకుస్థాపన జరుగుతున్నట్లు గానీ తనకెలాంటి ఆహ్వానం అందలేదని కార్పోరేటర్ అన్నారు. ఆహ్వానం అందకపోయినా.. సభకు వెళ్లిన కార్పోరేటర్ ను ఎమ్మెల్యే మునిరత్నం అనుచరులు తీవ్రంగా అవమానించారు. తనకు మాట్లాడాల్సిందిగా అవకాశం కల్పించాలని మంజులా నారాయణస్వామి కోరడంతో.. ఆమెను అడ్డుకోవడమే కాకుండా జుట్టు, చీర పట్టుకుని లాగారు.
మహిళా కార్పోరేటర్ పట్ల వాళ్లు వ్యవహరించిన తీరుకు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనతో ఇరువర్గాల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఘటనానంతరం మంజులా నారాయణస్వామి తీవ్ర కన్నీటిపర్యంతమయ్యారు. దాడి విషయం తమ పార్టీ(జనతా దళ్) రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి దృష్టికి తీసుకెళతానని చెప్పారు.












Click it and Unblock the Notifications