భారత్కు భారీ దెబ్బ: రూ.6,700 కోట్లు చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ/దిహేగ్: అంతర్జాతీయ ఇన్వెస్టర్ నుంచి శాటిలైట్ ఒప్పందాన్ని రద్దుచేసుకున్న కేసులో భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసుపై విచారించిన అంతర్జాతీయ ట్రైబ్యునల్ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో సుమారు బిలియన్ డాలర్ల (సుమారు రూ.6,700 కోట్లు) నష్టపరిహారం దేవాస్కు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వాణిజ్య విభాగం ఆంట్రిక్స్ ఏకపక్షంగా తమ స్పెక్ట్రమ్ కాంట్రాక్ట్ను రద్దు చేయడంపై దేవాస్.. అంతర్జాతీయ ట్రిబ్యునల్ను ఆశ్రయించిన విషయం తెలిసిందే. 2005లో అప్పటి ఇస్రో చైర్మన్ మాధవన్ నాయర్ సమక్షంలో ఆంట్రిక్స్, దేవాస్ మధ్య ఒప్పందం కుదిరింది. దీనికింద 70 మెగాహెర్ట్జ్ ఎస్ బ్యాండ్ స్పెక్ట్రమ్ను ఆంట్రిక్స్ దేవాస్కు అందించాల్సి ఉంటుంది.

జీశాట్ 6, జీశాట్ 6ఎ శాటిలైట్స్లోని 90 శాతం ట్రాన్స్పాండర్స్ను లీజుకు ఇవ్వడం ద్వారా ఈ స్పెక్ట్రమ్ను దేవాస్కు ఇచ్చేవిధంగా ఒప్పందం కుదిరింది. ప్రతిగా దేవాస్ 12 ఏళ్లలో ఆంట్రిక్స్కు 30 కోట్ల డాలర్లు చెల్లిస్తామని అంగీకరించింది.
అయితే దీనివల్ల నష్టమేనన్న నివేదికలు రావడంతో అప్పటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం 2011, ఫిబ్రవరి 17న ఈ ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేసింది.
దీంతో 2015లో డెవాస్ మల్టీమీడియా ది హాగ్లోని అంతర్జాతీయ ట్రైబ్యునల్ను ఆశ్రయించి భారత్పై కేసు పెట్టింది.
దీనిపై విచారించిన ట్రైబ్యునల్.. భారత్ అన్యాయంగా ప్రవర్తించిందని, దీని వల్ల డెవాస్లోని పెట్టుబడిదారులు చాలా నష్టపోయారని పేర్కొంది. తీర్పు ప్రతికూలంగా రావడంతో భారత్ దాదాపు బిలియన్ డాలర్ల వరకు పరిహారం చెల్లించాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications