టిలో మేమే, సీమాంధ్రపై ఆశల్లేవు: డిగ్గీ, మోడీపై ధ్వజం
కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఖాయమని ఎగ్జిట్పోల్స్ ప్రకటించడంపై దిగ్విజయ్ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ను అంత తేలిగ్గా కొట్టిపారేయవద్దని తాము లౌకికవాద రాజకీయాలను వీడబోమన్నారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా ప్రతిపక్షంలో కూర్చున్నా లౌకికవాదంపై రాజీ ఉండదన్నారు. 1977లో మీడియా తమను తీసిపారేసిందని, అయినా మళ్లీ వచ్చామని, 1989లోనూ అదే జరిగిందన్నారు.
1999లోనూ తేలిగ్గా తీసిపారేశారని, తమకు మళ్లీ పూర్వవైభవం వచ్చిందన్నారు. 48 గంటలు ఆగితే ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయని, ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుందో తేలిపోతుందన్నారు. 2004, 2009 లోక్సభ ఎన్నికల సమయంలోనూ ఎగ్జిట్ పోల్స్, మీడియాలు ఇలాంటి సర్వేలే ఇచ్చాయని, కానీ జరిగింది వేరన్నారు.
సుదీర్ఘ చరిత్రగల పార్టీకి ఇలాంటి ఒడిదుడుకులు మామూలేనన్నారు. ఒడిదుడుకులు వచ్చినంత మాత్రాన సామ్యవాద సిద్ధాంతం, లౌకికవాదాన్ని విస్మరించలేదని చెప్పారు. ఈ ఎన్నికలు సిద్ధాంతం, మతతత్వవాదం మధ్య జరిగాయన్నారు. మత చాంధసవాదులు, బిజెపితో కాంగ్రెస్ ఎన్నికల పోరు సాగించిందని ఆయన పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచారం మొదట్లో అభివృద్ధి గురించి మాట్లాడిన చివరికొచ్చేసరికి మత రాజకీయాలను తెరమీదకు తెచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్కు అధికారం ఉన్నా లేకున్నా సోషలిజం, సెక్యులరిజం కోసం పోరాడుతునే ఉంటుందన్నారు. ప్రజాస్వామ్యం అంటేనే మార్పు అని, ప్రభుత్వంలో ఉండి ఎన్నికల్లో పోరాడామని, తమకు మళ్లీ అవకాశం వస్తే ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు.
ఎన్నికల ఫలితాలు రాహుల్ గాంధీ నాయకత్వంపై ఎలాంటి ప్రభావం చూపుతాయన్న ప్రశ్నిస్తే... ఆయన నాయకత్వంపై పార్టీకి ఎంతో గౌరవరం ఉందని చెప్పారు. కార్పొరేట్ల అండదండలతోనే మోడీ ఎన్నికల ప్రచారంలో విచ్చలవిడిగా సొమ్ములు ఖర్చు పెట్టారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారానికి ఐదువేల కోట్ల రూపాయలు వెదజల్లారన్నారు.