ఒకటో తరగతి చదివి హెడ్ మాస్టర్ అయ్యాడు
చెన్నై: ఆయన చదివింది ఒకటో తరగితి. వేరే వ్యక్తి సర్టిఫికెట్లు పెట్టి టీచర్ ఉద్యోగం సంపాధించాడు. ఇప్పుడు హెడ్ మాస్టర్ అయ్యాడు. ఆయన సర్టిఫికెట్లు నకిలి అని వెలుగు చూడటంతో చదువురాని హెడ్ మాస్టర్ మాయం అయిన సంఘటన తమిళనాడులో జరిగింది.
క్రిష్ణగిరి జిల్లా వేప్పనపల్లి లోని కంగోజీకొత్తూరు పంచాయితీ డివిజన్ లో అరుళ్ సుందరం (42) హెడ్ మాస్టర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈయన క్రిష్ణగిరి జిల్లా కావేరిపట్టణం సమీపంలోని కదరీపురం ప్రాంతానికి చెందిన రాజా అనే వ్యక్తి సర్టిఫికెట్లు తీసుకున్నాడు.
తరువాత రాజా అనే పేరుతోనే సర్టిఫికెట్లు సమర్పించి ఉద్యోగం సంపాధించాడు. నకిలి సర్టిఫికెట్లతో సంపాధించిన ఆ టీచర్ ఉద్యోగం గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు. తమిళనాడులోని క్రిష్ణగిరి, ధర్మపురి, వేలూరు, తిరువణ్ణామలై జిల్లాల్లో ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు తనిఖీ చేస్తున్నారు.
ఇదే సమయంలో అరుళ్ సుందరం అలియాస్ రాజా సర్టిఫికెట్లు పరిశీలించారు. అనుమానం వచ్చిన అధికారులకు గురువారం విచారణకు హాజరుకావాలని మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధవారం నోటీసులు అందుకున్న అరుళ్ సుందరం మాయం అయ్యారు.
వేప్పనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పరారైన అరుళ్ సుందరం కోసం గాలిస్తున్నారు. 2001వ సంవత్సరం నుంచి అరుళ్ సుందరం టీచర్ గా ఉద్యోగం చేస్తున్నా అతని సర్టిఫికెట్లు పరిశీలించే విషయంలో పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు ఉన్నాయి.