రూ.40వేల కోట్ల నల్లధనం: కేంద్ర హోంశాఖ సంచలన ప్రకటన
నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి వచ్చే రూ.400 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట పడిందని కేంద్ర హోంశాఖ తెలిపింది.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపత్యంలో కేంద్ర హోంశాఖ శుక్రవారం నాడు సంచలన ప్రకటన చేసింది. దేశంలో ఇప్పుడు కూడా రూ.40వేల కోట్ల నల్లధనం చలామణిలో ఉందని కేంద్ర హోంశాఖ తెలిపింది.
అయితే నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్ సరిహద్దుల గుండా దేశంలోకి వచ్చే రూ.400 కోట్ల నకిలీ కరెన్సీ నోట్లకు అడ్డుకట్ట పడిందన్నారు. రూ.40వేల కోట్ల రూపాయల్లో రూ.800 కోట్ల రూపాయలు ఉగ్రవాదులకు అందుతున్నాయని పేర్కొన్నారు.
వేర్పాటువాదులకు, హింసాత్మక చర్యలకు రూ.30 కోట్లు వెచ్చిస్తున్నారని హోంశాఖ గుర్తించింది. నక్సలైట్లు తమ కార్యకలాపాలకు రూ.350 కోట్లు వినియోగిస్తున్నారని తెలిపాయి. ఖలిస్తాన్కు కూడా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారని వెల్లడించింది. సరిహద్దుల గుండా ఫేక్ కరెన్సీ రావడం ఆగిపోయిందని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు చెప్పారు.
వారికి మింగుడు పడటం లేదు: వెంకయ్య
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం మంచం కింద డబ్బు దాచుకున్నవారికే మింగుడు పడటం లేదని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు బెంగళూరులో అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చర్యలు నల్లకుబేరులు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చాక నల్లధనంపై సిట్ ఏర్పాటు తొలి నిర్ణయమన్నారు.
ఇప్పటి వరకు నల్లధనం వెనక్కి తీసుకురావాలని పట్టుబట్టారని, నల్లధనం వెనక్కి తెచ్చే చర్యలు చేపడితే విమర్శిస్తున్నారన్నారు. ప్రధాని మోడీపై దేశ, విదేశాల్లో అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మోడీని హిట్లర్, గడాఫీ తదితరులతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ తీసుకున్న చర్యల వల్ల దీర్ఘకాలంలో ఫలితాలు ఉంటాయన్నారు.