డిమాండ్లు తీర్చండి: ఢిల్లీలో కదం తొక్కిన యూపీ రైతులు...పరిస్థితి ఉద్రిక్తం
ఢిల్లీ: తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ దేశ రాజధాని ఢిల్లీలో నిరసన తెలిపిన తమిళనాడు రైతుల ఘటన మరవకముందే... ఉత్తర్ ప్రదేశ్ రైతులు కూడా తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ కిసాన్ క్రాంతి యాత్ర పేరుతో రైతులు ఢిల్లీకి కదం తొక్కారు. ఈ క్రమంలోనే పోలీసులు రైతులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. రైతులు కూడా తిరగబడటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఇందులో భాగంగానే ఢిల్లీ ఉత్తర్ప్రదేశ్ సరిహద్దుల్లో బారికేడ్లు భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు పోలీసులు. అంతేకాదు తూర్పు ఈశాన్య ఢిల్లీ ప్రాంతంలో పోలీసులు ఆంక్షలు విధించారు. చాలా ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లే ప్రయత్నం చేసిన రైతులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అంతేకాదు వారిని చెదరగొట్టేందుకు భాష్పవాయువును ప్రయోగించారు.
"మేము చేసిన తప్పేంటి..మమ్మలను ఎందుకు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. ర్యాలీ చాలా శాంతియుతంగా క్రమశిక్షణతో చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కరించమని కేంద్ర ప్రభుత్వానికి చెప్పకపోతే మరెవరికి చెప్పాలి. పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పాలా లేక బంగ్లాదేశ్ ప్రభుత్వానికి చెప్పాలా" అని ఆవేదన వ్యక్తం చేశారు రైతు సంఘాల అధ్యక్షుడు నరేష్ తికైత్ . ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. స్వామినాథన్ కమిషన్ సూచనలను అమలు చేయాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని... రుణమాఫీ చేయాలని కోరుతున్నామని నరేష్ చెప్పారు.
రైతుల ఆందోళన పై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ సమావేశానికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కూడా హాజరయ్యారు. మరోవైపు రైతుల నిరసనపై ప్రభుత్వ తీరును ఖండించారు ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. మోడీ సర్కార్ నియంతలా వ్యవహరిస్తోందని రైతును కాపాడాలంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే మార్గమని కమ్యూనిస్ట్ నేత సీతారాం ఏచూరి అన్నారు.
#WATCH Visuals from UP-Delhi border where farmers have been stopped during 'Kisan Kranti Padyatra'. Police use water cannons to disperse protesters after protesters broke the barricades pic.twitter.com/9KUwKgvrwW
— ANI (@ANI) October 2, 2018
కిసాన్ క్రాంతి యాత్ర సెప్టెంబర్ 23న హరిద్వార్ లోని తికాయిత్ ఘాట్ నుంచి ప్రారంభమైంది. ఉత్తర్ ప్రదేశ్లోని వివిధ ప్రాంతాలనుంచి రైతులు తరలి వచ్చి ఈ ర్యాలీలో పాల్గొన్నారు. కొందరు నడిచి రాగా మరికొందరు బస్సుల్లో ఇంకొందరు ట్రాక్టర్లలో వచ్చారు . వారు పలు బ్యానర్లను ప్రదర్శిస్తూ ఢిల్లీ వైపు కదం తొక్కారు. రైతులు పెద్ద ఎత్తున ఢిల్లీ వైపు ర్యాలీ తీయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. తూర్పు ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్లో ట్రాఫిక్ జామ్ అవడంతో పెద్ద ఎత్తున వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.