సీఎం వైఖరిలో అనూహ్య మార్పు - ప్రశాంత్ కిషోర్ తాజా అంచనాలివే..!!
పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. మరోసారి వార్తల్లోకెక్కారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో వైెఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా మెజారిటీతో విజయం సాధించడానికి వ్యూహాలను రచించిన ఆయన- ఇప్పుడు తాజాగా బిహార్ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తోన్నారు. అక్కడ అధికారంలో ఉన్న జనతాదళ్ (యునైటెడ్)లో ఉపాధ్యక్షుడిగా పని చేసిన ప్రశాంత్ కిషోర్- ఇప్పుడదే పార్టీపై ఘాటు విమర్శలు సంధిస్తోన్నారు.
ఎప్పుడు ఏ పార్టీలో..
బిహార్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ప్రశాంత్ కిషోర్ మరోసారి స్పందించారు. రాజకీయ అస్థిరత ఇంకా కొనసాగుతోందని, 10 సంవత్సరాల వ్యవధిలో ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఎనిమిదో సారి ప్రమాణ స్వీకారం చేయడం దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏదయినా ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ కొనసాగుతున్నారని, ఆయన ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారనేది అంతుచిక్కట్లేదని వ్యాఖ్యానించారు.
ఫెవికాల్కు బ్రాండ్ అంబాసిడర్గా..
ముఖ్యమంత్రి కుర్చీకి గ్లూ వేసుకుని అతుక్కుపోయిన నితీష్ కుమార్ను ఫెవికాల్ సంస్థ తన బ్రాండ్ అంబాసిడర్గా నియమించుకోవచ్చని ప్రశాంత్ కిషోర్ ఎద్దేవా చేశారు. నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ (యునైటెడ్)-బీజేపీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ప్రజల్లో సానుకూల అభిప్రాయం లేదని స్పష్టం చేశారు. 2024 నాటి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా నితీష్ కుమార్ను ప్రతిపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం లేదని, ఆయనలో నిలకడలేమి దీనికి కారణమని చెప్పారు.
కుర్చీని కాపాడుకోవడానికి..
బిహార్ అవతల నితీష్ కుమార్ ప్రభావం పెద్దగా ఉంటుందని తాను అనుకోవట్లేదని, ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పానని గుర్తు చేశారు. జేడీయూ-ఆర్జేడీ-కాంగ్రెస్-వామపక్షాల వంటి ఏడు పార్టీలతో కూడిన సంకీర్ణ కూటమి సుదీర్ఘకాలం పాటు కొనసాగుతందనే గ్యారంటీ లేదని, తన ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకోవడానికి నితీష్ కుమార్ ఇంకో పార్టీతో పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. ఇప్పటికే ఆయన ఎన్నోసార్లు పొత్తులను తెంచుకున్నారని అన్నారు.
ప్రధానిగా నమ్మకస్తుడు..
ప్రతిపక్షాల ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమార్ సరిపోడని, ఆయన నమ్మదగ్గ నాయకుడు కాకపోవడమే దీనికి కారణమని ప్రశాంత్ కిషోర్ చెప్పారు. నితీష్కు బదులుగా ప్రజల్లో క్రెడిబిలిటీ ఉన్న నాయకుడిని ఎన్నుకోవడం మంచిదని సూచించారు. మమత బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, కేసీఆర్.. ఇలా ఎవ్వరైనా సరే అందరినీ కలుపుకొని వెళ్లగల, అందరి ఆమోదం పొందిన నాయకుడిని ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్నుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ లక్షణాలు తనకు నితీష్ కుమార్లో కనిపించట్లేదని స్పష్టం చేశారు.
బీజేపీకి ప్రత్యామ్నాయంగా..
దేశంలో అత్యంత బలంగా ఉన్న బీజేపీని ఎదుర్కొనడానికి ప్రతిపక్షాలు అంతకంటే బలంగా తయారు కావాల్సిన అవసరం ఉందని, దీనికోసం విశ్వసనీయతతో కూడుకున్న రాజకీయాలను చేయాల్సి ఉంటుందని అన్నారు. అలాంటి విశ్వసనీయ నితీష్ కుమార్లో లోపించిందని ప్రశాంత్ కిషోర్ అన్నారు. తమ ఉమ్మడి ప్రధానమంత్రి అభ్యర్థిపై బూత్ స్థాయి కార్యకర్తలు, ప్రజల్లో నమ్మకం కలిగించాల్సి ఉంటుందని అప్పుడే విజయం సిద్ధిస్తుందని వ్యాఖ్యానించారు.