వాళ్లు నాపై మిస్సైల్ వేస్తే.. జస్ట్.. 303 రైఫిల్ తో అడ్డుకున్నా..!
కాంగ్రెస్ పార్టీకి తన రక్తం ధారపోశానని, అయినా తనను విస్మరించిందంటూ మండిపడిన గులాం నబీ ఆజాద్.. మరోసారి ఆ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ తనపై క్షిపణులు వేసిందని, కానీ తాను రైఫిల్తో అడ్డుకున్నానంటూ వ్యాఖ్యానించారు. జమ్ముకశ్మీర్లోని భదెర్వాలో జరిగిన భారీ ర్యాలీలో ఆయన మాట్లాడారు. తనపై కాంగ్రెస్ పార్టీ మిస్సైళ్లు ప్రయోగించిందని, తాను మాత్రం కేవలం 303 రైఫిల్తో వాటిని ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఆ విధంగా పార్టీపై ప్రతీకారం తీర్చుకున్నట్లు అభివర్ణించారు. ఒకవేళ తాను బాలిస్టిక్ క్షిపణి వేస్తే వారంతా మాయమైపోయేవారని ఆజాద్ అన్నారు.
దివంగత ప్రధానమంత్రులు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీపై మాత్రం ఆజాద్ విమర్శలు చేయలేదు. 52 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నానని, రాజీవ్ గాంధీని తనను సోదరుడిలా భావించేవారని, ఇందిరా గాంధీని తాను తల్లిలా భావించానన్నారు. అందుకే వారిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదలచుకోలేదని ఆజాద్ అన్నారు. కాంగ్రెస్తో ఉన్న 52 సంవత్సరాల సుదీర్ఘ అనుబంధాన్ని గులాంనబీ ఆజాద్ కొద్దిరోజుల క్రితమే తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్కు రాజీనామా చేయడంతో కశ్మీర్కు చెందిన మరికొందరు నేతలు కూడా రాజీనామా సమర్పించి ఆజాద్ వెంట నడిచారు.
కాంగ్రెస్కు రాజీనామా అనంతరం మొదటిసారి జమ్ములో ర్యాలీ నిర్వహించినప్పుడు కూడా ఆజాద్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కోసం రక్తం ధారపోస్తే.. ఆ పార్టీ ఇప్పుడు తనను విస్మరించిందన్నారు. సొంతంగా రాజకీయ పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించిన ఆజాద్ జమ్ము-కశ్మీర్కు రాష్ట్ర హోదా తిరిగివ్వాలనే అంశంపై తన పార్టీ పోరాటం జరుపుతుందని తెలిపారు. స్థానికులకు ఉద్యోగాలు, భూమి హక్కులపై కూడా పోరాడుతుందన్నారు. పార్టీ పేరును నిర్ణయించలేదని, జమ్ము కశ్మీర్ ప్రజలే పార్టీ పేరు, పతాకాన్ని నిర్ణయిస్తారని ఆజాద్ పేర్కొన్నారు