మీ నాయకత్వంలో సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు: మోడీతో భేటీపై సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మోడీతో చర్చించారు పిచాయ్. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు.
గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచాయ్.. ఈ సందర్భంగా ప్రధానితో భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని మోడీతో భేటీపై ట్విట్టర్ వేదికగా సుందర్ పిచాయ్ స్పందించారు. ప్రధానమంత్రి మోడీతో గొప్ప సమావేశం జరిగిందని.. అందుకు ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు పిచాయ్. జీ20కి భారత్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో పిచాయ్ అభినందనలు తెలిపారు.
మీ నాయకత్వంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులు రావడంతో ఎంతో స్పూర్తిదాయకం. మా దృఢమైన భాగస్వామ్యాన్ని కొనసాగించడంతోపాటు భారత్ అధ్యక్షత వహిస్తోన్న జీ-20 సదస్సు నిర్వహణకు పూర్తి మద్దతు కోసం ఎదురుచూస్తున్నాం అని సుందర్ పిచాయ్ ప్రధాని మోడీతో భేటీపై వ్యాఖ్యానించారు. జీ-20 సదస్సు అధ్యక్షత బాధ్యతలు ఇటీవల భారత్ స్వీకరించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా సుమారు 200 సమావేశాలు నిర్వహించనుంది. సెప్టెంబర్ 2023లో జీ20 సదస్సు ఢిల్లీలో జరగనుంది.
Thank you for a great meeting today PM @narendramodi. Inspiring to see the rapid pace of technological change under your leadership. Look forward to continuing our strong partnership and supporting India's G20 presidency to advance an open, connected internet that works for all. pic.twitter.com/eEOHvGwbqO
— Sundar Pichai (@sundarpichai) December 19, 2022
కాగా, ప్రస్తుతం గూగుల్.. స్టార్టలప్లపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగానే గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కేవలం స్టార్టప్ల కోసమే సుమారు 300 మిలియన్ డాలర్లను కేటాయించిన గూగుల్.. ఇందులో నాలుగో వంతును మహిళల నేతృత్వంలోని సంస్థల్లోనే పెట్టుబడి పెట్టనుంది.