ఢిల్లీలో ప్రభుత్వం అంటే ఇక నుండి ఎల్జీనే : కరోనా కల్లోల సమయంలో అమల్లోకి వివాదాస్పద చట్టం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. కోవిడ్ క్రూరమైన రెండవ దశ కొనసాగింపు సమయంలో వివాదాస్పదంగా మారిన ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ చట్టం 2021ని అమల్లోకి తీసుకొస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ చట్టం ప్రకారం ఢిల్లీలో ఎన్నుకోబడిన ప్రభుత్వంపై మరింత అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కలిగి ఉన్నారు.

ఢిల్లీ ప్రభుత్వం అంటే ఇప్పుడు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమే , ఏ నిర్ణయం అయినా ఆయన ద్వారానే
సవరించిన చట్టం ప్రకారం, ఢిల్లీ ప్రభుత్వం అంటే ఇప్పుడు కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రమేనని తెలుస్తుంది. దీని ప్రకారం ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎలాంటి ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవాలన్నా లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి . ఈ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ సవరణ చట్టం, 2021 నిన్నటి నుండి అమల్లోకి వచ్చిందని హోం మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ తెలిపింది.

ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకోవటానికి ఢిల్లీ ప్రభుత్వానికి ఎల్జీ అనుమతి తప్పనిసరి
ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలు తీసుకునే ముందు ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ అభిప్రాయాన్ని పొందవలసి ఉంటుంది. ఈ చట్టంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల నిరసనల మధ్య గత నెలలో పార్లమెంటులో వాడి వేడి చర్చ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ చేతుల నుండి అధికారం లాక్కునే కుట్రగా దీనిని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. మమతా బెనర్జీ సైతం కేజ్రీవాల్ కు మద్దతుగా ఈ చట్టంపై నిప్పులు చెరిగారు.
ఈ బిల్లు పార్లమెంటులో పాస్ అయినప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దీనిని "భారత ప్రజాస్వామ్యంలో విచారకరమైన రోజు" అని అభివర్ణించారు.

వివాదాస్పద చట్టంపై మండిపడిన కేజ్రీవాల్
అరవింద్ కేజ్రీవాల్ ఇది ఢిల్లీ ప్రజలకు "అవమానం" అని మండిపడ్డారు . ప్రజలు ఓటు వేసి గెలిపించిన వారి నుండి అధికారాలను సమర్థవంతంగా లాగేసే ప్రక్రియ అని, ఓడిపోయిన వారికి ఢిల్లీని నడిపించే అధికారాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. అరవింద్ కేజ్రీవాల్కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 2020 లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాల్లో 62 స్థానాలను గెలుచుకుంది. బిజెపికి ఎనిమిది మాత్రమే స్థానాలు లభించగా, కాంగ్రెస్కు ఒక్క స్థానం కూడా లభించలేదు.

కరోనా పంజా విసురుతున్న సమయంలో అమల్లోకి వివాదాస్పద ఎల్జీ చట్టం
ఈ క్రమంలోనే ఢిల్లీ పై ఆధిపత్యం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ ద్వారా ఢిల్లీని పాలించడానికి బిజెపి ప్రయత్నిస్తోందని, ఎన్నికైన ప్రభుత్వ ప్రణాళికలను అడ్డుకుంటుందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.కరోనా రెండోదశ వ్యాప్తితో సతమతమవుతున్న దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమయంలో ఈ చట్టాన్ని అమలుచేయడం చర్చనీయాంశంగా మారింది. ఒకపక్క కరోనా మహమ్మారి కారణంగా దేశ రాజధానిలో హెల్త్ ఎమర్జెన్సీ నెలకొంది. ఈ సమయంలో ప్రభుత్వ అధికారాలను నిర్వీర్యం చేస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ కు అధికారాలను పెంచుతూ చేసిన చట్టం అమల్లోకి వచ్చింది .












Click it and Unblock the Notifications