ప్రజలకు టోపీ పెట్టాలి ఇవ్వండి: చివరికి టీటీవీ దినకరన్ కు మిగిలింది అదే, పాపం !
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ అధికారులు గుర్తులు కేటాయించారు. ఆర్ కే నగర్ లో పోటీ చేస్తున్న అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు టీటీవీ దినకరన్ ఆయనకు కేటాయించిన గుర్తు చూసి షాక్ కు గురైనాడు. తనకు టోపీ గుర్తు లేదంటే విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తు ఇవ్వాలని టీటీవీ దినకరన్ కోర్టుకు వెళ్లినా, ఎన్నికల కమిషన్ కు మనవి చేసినా ఫలితం లేకపోయింది.
టోపీ గుర్తు
గతంలో ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన టీటీవీ దినకరన్ కు ఎన్నికల కమిషన్ అధికారులు టోపీ గుర్తు కేటాయించారు. ఆ సందర్బంలో ప్రతినిత్యం తల మీద టోపీ పెట్టుకుని టీటీవీ దినకరన్, ఆయన వర్గీయులు ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు.
నాకు అదే కావాలి
ఇప్పుడు జరుగుతున్న ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో తనకు టోపీ గుర్తు ఇప్పించాలని టీటీవీ దినకరన్ ఢిల్లీ కోర్టును ఆశ్రయించాడు. అయితే ఏ గుర్తు కేటాయించాలి అనేది ఎన్నికల కమిషన్ అధికారుల పరిధిలో ఉంటుందని, మేము అందులో జోక్యం చేసుకోమని కోర్టు టీటీవీ పిటిషన్ విచారణను తిరస్కరించింది.
ప్రజలకు టోపీ పెట్టాలని ?
తల మీద టోపీ పెట్టుకుని ప్రజలకు విచ్చలవిడిగా టోపీలు, నగదు పంచి పెట్టిన టీటీవీ దినకరన్ కు చివరికి ఎదురు దెబ్బ తగిలింది. ఎలాగైనా ఆర్ కే నగర్ ప్రజల నెత్తిన టోపీ పెట్టాలని ప్రయత్నించిన టీటీవీ దినకరన్ కు ఎన్నికల కమిషన్ అధికారులు షాక్ ఇచ్చారు.
రెండాకుల చిహ్నం
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం వర్గం నాయకుడు మధుసూదనన్ కు ఎన్నికల కమిషన్ అధికారులు రెండాకుల చిహ్నం కేటాయించారు. ఈ నేపథ్యంలో గతంలో తమకు కేటాయించిన టోపీ గుర్తునే కేటాయించాలంటూ దినకరన్ ఈసీకి మనవి చేసినా ఫలితం లేకపోయింది.
టోపీ ఎత్తుకు పోయారు
ఎన్నికల కమిషన్ అధికారులు టోపీ గుర్తును కొంగునాడు మున్నేట్ర కగజమ్ అభ్యర్థి రమేష్ కు కేటాయించి టీటీవీ దినకరన్ కు షాక్ ఇచ్చారు. టోపీ గుర్తు కావాలని, లేదంటే విజిల్, క్రికెట్ బ్యాట్ గుర్తు ఇవ్వాలని టీటీవీ దినకరన్ చేసిన మనవిని ఎన్నికల కమిషన్ అధికారులు తిరస్కరించారు.
చివరికి మిగిలింది ఇదే !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీటీవీ దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ ను కేటాయిస్తున్నట్లు ఎన్నికల కమిషన్ అధికారులు ప్రకటించారు. ఈ విషయంపై స్పందించిన టీటీవీ దినకరన్ తాను ప్రత్యర్థుల మీద మరింత ఒత్తిడి పెంచడానికి ఈ గుర్తు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
నెత్తిన పెట్టుకోమనండి !
తమిళనాడులో అధికారంలో ఉన్న ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం వర్గీయులు ఇప్పుడు టీటీవీ దినకరన్ మీద జోకులు వేస్తున్నారు. గతంలో తల మీద టోపీ పెట్టుకుని ప్రజలకు టోపీ పెట్టాలని ప్రయత్నించిన టీటీవీ దినకరన్ ఇప్పుడు నెత్తిన ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని ప్రచారం చేస్తే మరింత బాగుంటుందని ఎద్దేవ చేస్తున్నారు.