ఆచరణ సాధ్యం కాని ఆదేశాలు ఇవ్వొద్దు-హైకోర్టులకు సుప్రీం కీలక సూచన-యూపీ సర్కార్కు ఊరట..
కరోనా సంక్షోభానికి సంబంధించి రాష్ట్రాల హైకోర్టులు ఆచరణ సాధ్యం కాని తీర్పులు ఇవ్వొద్దని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఉత్తరప్రదేశ్లో కరోనా పరిస్థితులకు సంబంధించి సుమోటో కేసు విచారణ సందర్భంగా ఇటీవల అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీం 'స్టే' విధించింది. హైకోర్టు చేసిన సూచనలు బాగానే ఉన్నాయి... కానీ అవి ఆచరణ సాధ్యమా కాదా అన్నది కూడా పరిగణలోకి తీసుకోవాలని న్యాయస్థానం పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు ఇటీవలి ఆదేశాలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించడంతో శుక్రవారం(మే 21) దీనిపై విచారణ జరిగింది.
అలహాబాద్ హైకోర్టు ఆదేశాలివే...
ఉత్తరప్రదేశ్లోని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న కరోనా పరిస్థితులను అలహాబాద్ హైకోర్టు సుమోటో కేసుగా స్వీకరించింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ప్రభుత్వానికి పలు కీలక ఆదేశాలిచ్చింది. ఉత్తరప్రదేశ్లోని అన్ని నర్సింగ్ హోమ్స్లో ఉన్న బెడ్లకు నాలుగు నెలల్లోగా ఆక్సిజన్ ఫెసిలిటీ కల్పించాలని ఆదేశించింది. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ గ్రామంలో రెండు అంబులెన్సులు ఏర్పాటు చేయాలని... వాటిల్లో ఐసీయూ సౌకర్యం ఉండాలని ఆదేశించింది. హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయగా... తాజాగా సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు ఆదేశాలను నిలుపుదల చేసింది. దీంతో యూపీ సర్కార్కు ఊరట లభించినట్లయింది.
'ఆ వ్యాఖ్యలను సూచనగా పరిగణించండి'
ఉత్తరప్రదేశ్ను 'ఇక ఆ భగవంతుడే కాపాడాలి' అని హైకోర్టు చేసిన వ్యాఖ్యలపై యోగి సర్కార్ సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం తరుపున కోర్టుకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహాతా.. హైకోర్టు వ్యాఖ్యలు హెల్త్ కేర్ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా,వారిని భయాందోళనకు గురిచేసేలా ఉన్నాయని పేర్కొన్నారు. అయితే సుప్రీం పరోక్షంగా ఆ వ్యాఖ్యలను సమర్థించింది. హైకోర్టు పరిశీలన ప్రజల పట్ల ఆందోళనను వ్యక్తం చేసిందని... అలాంటి వ్యాఖ్యలను సూచనగా పరిగణించాలని పేర్కొంది.
యూపీలో అద్వాన్న పరిస్థితులు...
ఉత్తరప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో కరోనా పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని ఇటీవల జాతీయ మీడియాలో పలు కథనాలు వచ్చాయి. ఆ కథనాల ప్రకారం... అక్కడి ఆస్పత్రుల్లో కనీసం టాయిలెట్స్ కూడా లేవు. దీంతో పేషెంట్లు బహిర్భూమికి వెళ్తున్నారు. ఇతవహ్ జిల్లాలోనే అతిపెద్ద ఆస్పత్రి అయిన అంబేడ్కర్ ఆస్పత్రిలో టాయిలెట్స్కు తాళం వేశారు. ఆస్పత్రి బయట ఒక నీళ్ల ట్యాప్ ఉండగా... దానికి సమీపంలోనే పేషెంట్లు బహిర్భూమికి వెళ్తున్నారు.అంతేకాదు,కోవిడ్ వార్డుల్లో గుట్టలుగా చెత్త పేరుకుపోయింది. కనీసం ఆక్సిజన్ పెట్టేందుకు కూడా అక్కడ సిబ్బంది అందుబాటులో ఉండటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్ ప్రజలు ఆస్పత్రుల కంటే దేవుడినే నమ్ముకుంటున్నారు. ఆ దేవుడే తమను కాపాడాలంటూ 9 రోజుల పాటు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితులను సుమోటో కేసుగా స్వీకరించిన అలహాబాద్ హైకోర్టు ఇక యూపీ ప్రజలను ఆ భగవంతుడే కాపాడాలని పేర్కొంది.
Recommended Video