ఆఫ్గన్ విద్యార్థులకు ఐఐటీ బాంబే గుడ్ న్యూస్... క్యాంపస్ హాస్టల్లో చేరేందుకు అనుమతి..
క్షణక్షణం అంతులేని భయం... రేపటిపై భరోసా లేని జీవితం... ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన... ఇదీ ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్ ప్రజల దుస్థితి. తాలిబన్ల రాజ్య స్థాపనతో ఆఫ్గనిస్తాన్ ప్రజల ప్రాథమిక మానవ హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి ఏర్పడింది. ఆఫ్గన్ ఇక ఎంతమాత్రం సురక్షితం కాదని అక్కడి ప్రజలు భావిస్తున్నారు. అందుకే అవకాశం చిక్కితే అక్కడి నుంచి బయటపడేందుకు చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆఫ్గన్ విద్యార్థులకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ), బాంబే గుడ్ న్యూస్ చెప్పింది.
కరోనా కారణంగా ఆఫ్గనిస్తాన్ వెళ్లిపోయిన ఐఐటీ బాంబే విద్యార్థులు తిరిగి క్యాంపస్ హాస్టల్కి వచ్చి ఉండవచ్చునని ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ సుభాసిస్ చౌధురి వెల్లడించారు.'ICCR స్పాన్సర్ చేసే స్కాలర్షిప్ల కింద ఈ సంవత్సరం మాస్టర్స్ ప్రోగ్రామ్లో ఆఫ్ఘనిస్తాన్ నుండి చాలా మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇచ్చాం. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం వారు తమ స్వదేశంలోని ఇళ్ల నుంచే ఆన్లైన్ క్లాసుల్లో పాల్గొంటున్నారు.అయితే, వారి స్వదేశంలో పరిస్థితులు ప్రస్తుతం అత్యంత వేగంగా క్షీణిస్తున్నాయి. ఈ కారణంగా ఆఫ్గనిస్తాన్ నుండి బయటకు వచ్చి క్యాంపస్లోని హాస్టల్స్లో చేరాలని వారు భావిస్తున్నారు. దీన్నొక ప్రత్యేక కేసుగా పరిగణించి వారికి అనుమతినిస్తున్నాం. అయితే క్యాంపస్కు రావాలన్న వారి అభ్యర్థనను మేము అంగీకరించినప్పటికీ... వారి కలలు నెరవేరేందుకు ఎంత ఆలస్యమవుతుందో తెలియదు. వారందరూ సురక్షితంగా ఉన్నారని,త్వరలో మాతో చేరగలరని ఆశిస్తున్నాము.' అని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాసిస్ చౌధురి పేర్కొన్నారు.
ఐఐటీ బాంబేతో పాటు దేశంలోని పలు యూనివర్సిటీల్లో ఆఫ్గనిస్తాన్ విద్యార్థులు చదువుతున్నారు. కరోనా కారణంగా స్వదేశం వెళ్లిన ఆ విద్యార్థులు ఇప్పుడు తాలిబన్ల నిర్బంధంలో చిక్కుకుపోయారు. దీంతో మళ్లీ తమను భారత్కు అనుమతించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.ఐఐటీ బాంబే లాగే ఇతర వర్సిటీలు కూడా వారికి క్యాంపస్ హాస్టల్లో చేరేందుకు అనుమతినిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.
ఆఫ్గనిస్తాన్లో పరిస్థితికి సంబంధించి చాలా వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.సోమవారం(ఆగస్టు 16) వేలాది మంది కాబూల్ విమానాశ్రయానికి పోటెత్తారు. విమానంలో ఎక్కేందుకు పోటీ పడ్డారు. ఆఖరికి ప్రమాదకరంగా విమానం రెక్కలపై సైతం జనం ఎక్కుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలా ప్రయాణించిన ఇద్దరు వ్యక్తులు కింద పడి చనిపోయారు.
ఆదివారం(ఆగస్టు 16) తాలిబన్లు కాబూల్ నగరాన్ని ఆక్రమించడంతో ఆఫ్గనిస్తాన్ దురాక్రమణ పూర్తయింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్గనిస్తాన్ రాజ్య స్థాపన చేస్తున్నట్లు తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్గనిస్తాన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ ఇక అధికారాన్ని తాలిబన్లకు అప్పగిస్తున్నట్లు ప్రకటించి దేశాన్ని వీడి పారిపోయారు. తాలిబన్ నేత అబ్దుల్ ఘనీ బరాదర్ ఆఫ్గన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.
ఆఫ్గనిస్తాన్లో నెలకొన్న పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఆఫ్గనిస్తాన్ కోసం ప్రపంచ దేశాలన్నీ ఏకం కావాలని ఐరాస చీఫ్ ఆంటానియో గుటెరస్ పిలుపునిచ్చారు.యావత్ ప్రపంచానికి ముప్పుగా పరిణమించే ఉగ్రవాదాన్ని ప్రపంచ దేశాలన్నీ కలిసి ఎదుర్కోవాలన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్గనిస్తాన్ మరోసారి వేదిక కాకుండా,ఉగ్ర సంస్థలు దాన్ని సురక్షిత స్థావరంగా చేసుకునే అవకాశం ఇవ్వకుండా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు.