భారతీయులు నా గురువులు: బౌద్ధ గురువు దలైలామా
గాంధీనగర్: భారతీయులను గురువులుగా భావిస్తానని టిబెటన్ల బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అన్నారు. గురువారం ఆయన గుజరాత్కు తొలిసారిగా వచ్చిన సందర్భంగా సూరత్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. ప్రాచీన కాలంలో నలందా విశ్వవిద్యాలయం ప్రపంచంలో ముఖ్య కేంద్రంగా ప్రఖ్యాతి చెందిన విషయాన్ని ప్రస్తావించారు.
తన మనసు నిండా నలందానే వుంటుందని దలైలామా అన్నారు. అందుకనే భారతీయులకు తాము సాంప్రదాయకంగా, చారిత్మాకంగా శిష్యులమని ఆయన పేర్కొన్నారు. మా గురువుకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నానని అన్నారు.
అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న దలైలామా ‘సంతోక్బా అవార్డు'ను తీసుకునేందుకు గురువారం ఆయన సూరత్ వచ్చారు. ఈ అవార్డు బంగారుపూత కలిగి, పలు డైమండ్లు పొదగబడి ఉంటుంది. అవార్డుతోపాటు రూ. 25 లక్షల నగదును కూడా అందజేయనున్నారు.
సూరత్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ ధోలకియా తన తల్లి జ్ఞాపకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. శ్రీరామకృష్ణా ఫౌండేషన్ ద్వారా ఈ అవార్డును అందజేయనున్నారు. రెండు రోజులపాటు సూరత్లో పర్యటించనున్న దలైలామా.. అవార్డు స్వీకరించిన తర్వాత స్థానిక విద్యార్థులతోపాటు టిబెట్కు చెందిన ప్రజలతో ఆయన సమావేశమవుతారు.
కాగా, ఇంతకుముందు ఈ అవార్డును టెలికాంకు అందించిన సేవలకు గానూ శ్యాం పిట్రోడా, క్షీర విప్లవానికి బాటలు వేసిన వర్గీస్ కురియన్, ప్రముఖ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్ డాక్టర్ హెచ్ఎల్ త్రివేదిలకు అందజేశారు. గాంధేయవాది నారాయణ్ దేశాయి, స్వాతంత్ర్య సమరయోధురాలైన పూర్ణిమా పక్వాస, శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్లకు కూడా ఈ అవార్డు లభించింది.