పావులు కదుపుతున్న శశికళ: 'ఆర్కే నగర్' నుంచి పోటీ! రంగంలోకి ఫ్యామిలీ
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనంతరం అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి రానున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది.
చెన్నై: దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనంతరం అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు శశికళ చేతుల్లోకి రానున్నాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. జయ వారసురాలిగా శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించిన అనంతరం ఆమెను శాసన సభకు పంపించేందుకు కూడా రంగం సిద్ధమవుతోందట.
శశికళ కోసం రంగంలోకి కోటరీ
జయ మృతి నేపథ్యంలో ఆమె ప్రాతినిథ్యం వహించన ఆర్కే నగర్కు ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. ఆరు నెలల్లోపు ఈసీ ఈ ఉప ఎన్నికలను పూర్తి చేస్తుంది. ఈ లోపు పార్టీలోని అన్ని వ్యవహారాలను చక్కబెట్టి శశికళకు ఎదురు లేకుండా చేసేలా ఆమె కోటరి రంగంలోకి దిగిందంటున్నారు.
ఆర్కే నగర్ నుంచి పోటీ.. ఆమె కనుసన్నుల్లోనే
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయడం ద్వారా జయ వారసురాలిగా అధికారికంగా ప్రకటించుకున్నట్లు అవుతుందని, ఆ తర్వాత అవసరాన్ని బట్టి అధికారాన్ని చేపట్టే అవకాశాలు కూడా లేకపోలేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం, పార్టీ ఆమె కనుసన్నుల్లో నడుస్తోందని అంటున్నారు.
పరోక్ష సంకేతాలు
మొత్తానికి జయ నెచ్చెలి శశికళ పార్టీ.. ఆ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టే దిశగా పావులు కదులుతున్నాయి. ఈ దిశగా ఆమె బుధవారం పార్టీ శ్రేణులకు కొన్ని పరోక్ష సంకేతాలు పంపారు.
జయ ప్రతినిధిగా..
చో రామస్వామికి నివాళులర్పించడానికి శశికళ పోయెస్ గార్డెన్లోని జయలలిత ఇంటి నుంచి పోలీసు ఎస్కార్ట్తో రావడం, జయలలిత ప్రతినిధిగా చో కుటుంబాన్ని పరామర్శించడంవంటి వాటి ద్వారా ఆమె పార్టీలో జయ అనంతరం ప్రత్యామ్నాయం తానేనని సంకేతాలు పంపారని భావిస్తున్నారు.
రంగంలోకి భర్త
మరోవైపు శశికళ భర్త నటరాజన్ క్రియాశీలంగా మారారు. ఇప్పటికే పలువురు మంత్రులు, శాసనసభ్యులు ఆయనను కలుస్తున్నారని తెలుస్తోంది. వారందరితోనూ ఆయన మంతనాలు జరిపి అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారని అంటున్నారు. ఇక ఇప్పటికే శశికళ ఆదేశాల మేరకు ఆమె సోదరుడు దివాకరన్ కనుసన్నల్లో వ్యవహారాలు సాగుతున్నాయని అంటున్నారు.
ఆమె చేతుల్లోకి
శశికళ కుటుంబ సభ్యులు, మన్నార్గుడి (శశికళ సొంతూరు) నాయక గణమంతా ఆమె చేతుల్లోకి వ్యవహారాలు వచ్చేలా పావులు కదుపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడంలో ఎవరికీ భిన్నాభిప్రాయాలు లేకపోవడంతో పార్టీ పగ్గాలు శశికళకు అధికారికంగా అప్పజెప్పేందుకు రంగం సిద్ధమయినట్లేనని భావిస్తున్నారు.
వారికి బుజ్జగింపులు
ఒకవేళ పార్టీలో అసంతృప్తులు ఉంటే వారిని బుజ్జగింపుల ద్వారా దారిలోకి తెచ్చుకునేందుకు శశికళ వర్గం పావులు కదుపుతోందని ప్రచారం సాగుతోంది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళను నియమిస్తూ తీర్మానం చేయాలని ఇటీవల జరిగిన పార్టీ శాసనసభాపక్షం సమావేశంలో అనుకున్నారని, అయితే జయ మృతి చెందిన సమయంలో అలాంటి ప్రకటన సరికాదని ఊరుకున్నారని అంటున్నారు. దాంతో ఆ ప్రకటన వెలువడలేదు.
జయ
వారం రోజుల పాటు జయ మృతికి ప్రభుత్వం సంతాప దినాలు ప్రకటించింది కాబట్టి ఈ సమయంలో రాష్ట్రంలోనూ, అన్నాడీఎంకేలోనూ పెద్దగా రాజకీయ పరిణామాలు మారే సూచనలు కనిపించడం లేదు. ఆ తరువాత రాజకీయంగా ఆ పార్టీ ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశముందని అంటున్నారు.