ఆప్తులకు ఆమె అమ్మ, ప్రత్యర్థులకు మాత్రం కఠినాత్మురాలు
సంక్షేమమే ధ్యేయంగా జయలలిత పాలన సాగించారు. ఆమెను దగ్గర నుండి చూసినవారంతా ఆమె పేమ కలవారని, సహాయం కోసం అర్థించేవారికి ఆమె సహయం చేసేవారని చెబుతారు.
చెన్నై :తమిళనాడు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన జయలలితను దగ్గరనుండి చూసినవారు ఆమెను దేవతగా చూస్తారు. ప్రత్యర్థులు మాత్రం ఆమెను అహంబావిగా భావిస్తారు. పేదలకు మాత్రం అమ్మగా భావిస్తారు.సన్నిహితులను ఆమె ఆత్మీయంగా పలుకరిస్తారు,ప్రత్యర్థులపై మాత్రం కనికరం చూపరు. తనను ఇబ్బందిపెట్టినవారిని అదే స్థాయిలో ఇబ్బందిపెట్టేందుకు ఆమె వెనుకాడరు.
సంక్షేమమే ధ్యేయంగా పాలన
జయలలిత ప్రత్యర్థుల పట్ల కఠినంగా నిర్ణయాలు తీసుకొన్నా, తన సన్నిహితుల పట్ల ఉదారంగా , ఆత్మీయంగా వ్యవహారిస్తారు. ఆమె తీసుకొన్న నిర్ణయాల కారణంగా ఆమె తమిళనాట పేదలకు అమ్మగా మారింది. గత ఎన్నికల్లో ఆమె తీసుకొన్న నిర్ణయాలతో వరుసగా రెండోసారి ఆమె నేతృత్వంలో పార్టీ రెండో సారి అధికారంలోకి వచ్చింది. 1991 ఎన్నికల్లో జయలలిత నేతృత్వంలో పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో ఆమె పార్టీ ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆమె తీసుకొన్న నిర్ణయాలు కొన్నివివాదాస్పదమయ్యాయి. 1996 లో జరిగిన ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు.ఆనాటి నుండి ఆమె ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించారు. తల్లిదండ్రులు వదిలేసిన శిశువులను చెత్తకుప్పల్లో వేయకుండా క్రెడిల్ బేబీ స్కీమ్ ను ఆమె ప్రవేశపెట్టింది.చెన్నైలో నీటి కొరతను తీర్చేందుకు ఆమె వీరానం చెరువు నుండి నీటిని తెప్పించారు. మహిళా సాధికారత కోసం ఆమె కార్యక్రమాలను చేపట్టారు. మహిళలను ఫైర్ ఆఫీసర్లుగా,మహిళా బెటాలియన్ లను ఏర్పాటు చేశారు.తండ్రి పేరు స్థానంలో తల్లి పేరును కూడ విధ్యార్థులు తమ సర్టిఫికెట్లలో ఉపయోగించుకొనే ఆమె చట్టాన్ని తీసుకు వచ్చారు. అమ్మ క్యాంటీన్ పథకం ఇటీవల కాలంలో బాగా సక్సెస్ అయింది.
చరిత్ర తిరగరాసింది
ఎంజిఆర్ కారణంగానే ఆమె రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజిఆర్ ఆమెను రాజకీయాల్లో బాగానే ప్రోత్సహించారు. ఆమె మరణం తర్వాత పార్టీలో ఆమె ప్రస్థానం ముగిసిందని భావించిన వారికి ఆమె షాకిచ్చారు. అనేక అవమానాలను సహిస్తూ ఆమె అగ్రస్థానానికి చేరుకొన్నారు.ఎంజిఆర్ మరణించిన విషయం తెలుసుకొని ఆయన ఇంటికి వెల్తే ఆమెను దూషించారు. శవయాత్రలో వాహనం నుండి ఆమెను కిందకు దించేశారు.1989 ఎన్నికల్లో ఆమె ప్రతిపక్షనాయకురాలిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అయితే ఈ సభలో ఆమెను డిఎంకె ఎంఏల్ఏలు అవమానించారు. ముఖ్యమంత్రిగానే అడుగుపెడతానని ఆమె శపథం చేసి 1991 లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెట్టారు.
ప్రత్యర్థులను చీల్చి చెండాడింది.
ఎంజిఆర్ మరణం తర్వాత కొంత కాలంపాటు ఆయన సతీమణి జానకీ రామచంద్రన్ ముఖ్యమంత్రిగా వ్యవహారించారు. అయితే అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ తమిళనాడు ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఈ ఘటనతో జానకీ రామచంద్రన్ రాజకీయాలనుండి తెరమరుగయ్యారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో జయలలిత విపక్షనాయకురాలిగా సభలో అడుగుపెట్టారు. అయితే జానకీ రామచంద్రన్ నేతృత్వంలోని పార్టీ నాయకులు కూడ జయపంచన చేరారు. అయితే పార్టీలో సీనియర్లు కూడ తాను చెప్పినట్టు వినేలా ఆమె వ్యూహరచన చేశారు. 1991లో అధికారంలోకి రావడంతో ఆమె చెప్పిందే పార్టీలో శాసనంగా మారింది.ప్రత్యర్థులపై ఆమె ఉక్కుపాదం మోపింది.జయను ఇబ్బంది పెట్టిన డిఎంకె అధినేత కరుణానిధిని ఆమె అదే స్థాయిలో ఇబ్బంది పెట్టింది. అవినీతి ఆరోపణలతో కేసులు బనాయించి జయను డిఎంకె ప్రభుత్వం జైల్లో పెట్టించింది. అయితే డిఎంకె ఓటమి పాలై జయ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆమెఅర్థరాత్రి కరుణానిధిని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టింది.పార్టీని చీల్చేందుకు ప్రయత్నించిన తిరునావుక్కరసుకు టిక్కెట్ దక్కకుండా చేశారు. వైగో ను పోటా చట్టం కింద అరెస్టు చేయించారు. నక్కీరన్ పత్రిక ఎడిటర్ గోపాల్ ను జైల్లో పెట్టారు.
ఎవరినైనా ఎదిరించేది
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో ఆమె తీసుకొన్న నిర్ణయాలను విమర్శించే మీడియాను ఆమె వదిలిపెట్టలేదు. హిందూ పత్రికపై ఆమె బహిరంగంగానే కయ్యానకి కాలు దువ్వారు. ఆ పత్రిక ఎడిటర్లను అరెస్టు చేసేందుకు కూడ యత్నించారు. పలు మీడియా సంస్థలపై ఆమె కేసులు దాఖలు చేసింది. ప్రధానమంత్రి వాజ్ పేయ్ గా ఉన్న కాలంలో రెండు దఫాలు చెన్నై పర్యటించిన సమయంలో ఆమె ప్రోటోకాల్ ను ఆమె ఉల్లంఘించింది.తనను అవమానించేలా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ సినియర్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ ను ఆమె అవమానించారు. ఉద్యోగుల డిమాండ్ల పట్ల ఆమె వ్యవహరించిన తీరు కూడ వివాదాస్పదమైంది.ఉద్యోగులు చేసిన డిమాండ్లను కొన్ని నెరవేర్చేందుకు ఆమె సుముఖంగా ఉన్నా, అన్నీ డిమాండ్ల కోసం ఉద్యోగసంఘాలు పట్టుబట్టాయి.అయితే సమ్మెకు దిగిన ఉద్యోగులందరినీ ఆమె విధుల నుండి తప్పించారు.పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ నిర్ణయంపై ఆమె మనసు మార్చుకొన్నారు.
సహాయం చేసే మనసు
స్మగ్లర్ వీరపన్సన్ ను చంపిన పోలీసులకు ఆమె ఉదారంగా ప్రోత్సహాలను ప్రకటించారు. నగదు, ఇంటి స్థలంతో పాటు, ఉద్యోగంలో ప్రమోషన్ కూడ ఇచ్చారు. ఆమె దృష్టిలో పడిన ఓ వికలాంగుడికి ఆమె ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు. చనిపోయిన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు ఆమె నుండి సహాయం అందేది.ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని నటుడు పార్థీబన్ లేఖ రాస్తే ఆమె లక్షరూపాయాల చెక్కను ఆయనకు పంపింది. గాయనీ జిక్కీ ఆసుపత్రిలో చికిత్స పొందుతన్న సమయంలో ఆమె ఉదారతతో సహాయం చేశారు. ఆమె దృష్టిలో పడితే చాలు ఆర్థికంగా ఆ కుటుంబానికి ఉన్న కష్టాలు తీరేందుకు ఆమె కృషిచేస్తోంది.