జయలలితకు ఎన్నికల విక్టరీ!: స్టాలిన్కు షాక్, ఆశలపై నీళ్లు
చెన్నై: అక్రమాస్తుల కేసులో తమ పార్టీ అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి జయలలితకు హైకోర్టులో ఊరట లభించడంతో అన్నాడీఎంకే వర్గాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి. అయితే, అంతిమ నిర్ణయం మాత్రమే జయలలిదేనని అంటున్నారు. ఇదిలా ఉండగా, జయలలితకు హైకోర్టులో ఊరట లభించడం డీఎంకే పార్టీకి పెద్ద షాక్ అని అంటున్నారు.
జయలలితను హైకోర్టులో నిర్దోషిగా తేల్చడం వల్ల అన్నాడీఎంకేకు ప్రజల్లో మరింత ప్రతిష్ట పెరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, ఇదే ఊపులో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం మంచిదని భావిస్తున్నారు. అదే సమయంలో హైకోర్టు తీర్పు డీఎంకేకు షాక్.
ఆస్తుల కేసులో జయలలితను కోర్టు దోషిగా చెబితే అది అన్నాడీఎంకే పార్టీకి నష్టం జరిగి, తమకు బాగా లబ్ధి చేకూరేదని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పుడు రివర్స్ అయిందని భావిస్తున్నారు.
కర్నాటక హైకోర్టు తీర్పు డీఎంకేను షాక్కు గురిచేసింది. జయలలితకు హైకోర్టులో చుక్కెదురు అవుతుందనుకున్న డీఎంకే నేత స్టాలిన్ ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. జయ అక్రమాస్తుల కేసును హైకోర్టు కొట్టిపారేయడంతో స్లాలిన్ బృందం గందరగోళంలో పడింది.
జయపై ఉన్న కేసులన్నీ రద్దు కావడంతో రానున్న ఎన్నికల్లో డీఎంకేకు గట్టి పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. హైకోర్టు తీర్పు ఒకవిధంగా తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే విక్టరీకి సంకేతమని జయ అభిమానులు భావిస్తున్నారు.