ఇస్రో ‘బాహుబలి’: ఐదో తేదీన మానవ సహిత ఉపగ్రహం
స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ - 3 ద్వారా ఇస్రో మరో చరిత్ర నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అగ్ర రాజ్యాల సరసన సగర్వంగా తలెత్తుకుని నిలువనున్నది.
న్యూఢిల్లీ: స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన జీఎస్ఎల్వీ - 3 ద్వారా ఇస్రో మరో చరిత్ర నెలకొల్పేందుకు సిద్ధమవుతోంది. తద్వారా అగ్ర రాజ్యాల సరసన సగర్వంగా తలెత్తుకుని నిలువనున్నది. భారత వ్యోమగాములను సొంతగడ్డ మీద నుంచి అంతరిక్షంలోకి పంపే కల సాకారం కావడం సమీపంలోనే ఉన్నది.
ఈ బృహత్ లక్ష్యానికి అనుగుణంగా ఇస్రో తన బాహుబలిని సిద్ధం చేసింది. 200 ఏనుగుల బరువుతో సమానమైన భారీ రాకెట్ను అంతరిక్షానికి ఎక్కుపెట్టింది! జీఎస్ఎల్వీ ఎంకే -3గా పిలుస్తున్న 640 టన్నుల బరువైన రాకెట్ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం విశేషం.
జూన్ ఐదో తేదీన ఈ రాకెట్ను శ్రీహరికోట ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించేందుకు ఇస్రో రంగం సిద్ధం చేస్తున్నది. విజయవంతమైతే మానవ మిషన్ ప్రారంభమైనట్లే. జీఎస్ఎల్వీ - 3 ఇది పూర్తిగా నిండిన ఐదు జంబో విమానాలతో సమానమైనది. భారత్ ఇప్పటి వరకూ తయారుచేసిన అత్యంత బరువైన రాకెట్ ఇదేకావడం ఒక విశేషం కాగా, దాన్ని పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించడం మరో ఘనత!
వచ్చే సోమవారం అంతరిక్షంలోకి దూసుకెళ్లనున్న జీఎస్ఎల్వీఎంకే
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని రాకెట్పోర్టులో ఠీవిగా నిలిచి ఉన్న ఇస్రో బాహుబలి.. జియోసింక్రనస్ లాంచ్ వెహికల్ మార్క్-3 (జీఎస్ఎల్వీ ఎంకే-3) వచ్చే సోమవారం అంతరిక్షంలోకి దూసుకుపోనున్నది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షయాన చరిత్రలో భారత్ మరో మైలురాయిని అధిగమించినట్లవుతుంది. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగం కేంద్రం నుంచి జరుపనున్న ఈ జీఎస్ఎల్వీ ఎంకే-3 ఉపగ్రహ పరీక్ష ద్వారా ఇస్రో సామర్థ్యం వేల కోట్ల మార్కెట్ను చేరుకుంటుందని సంస్థ చైర్మన్ ఏఎస్ కిరణ్కుమార్ తెలిపారు. మొదట మార్క్-3 వాహక నౌకగా పిలిచిన దీనికి ఇప్పుడు జీఎస్ఎల్వీ ఎంకే-3గా పేరు పెట్టారు.
జీఎస్ఎల్వీ ఎంకే-3 విశేషాలు
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జీఎస్ఎల్వీ ఎంకే - 3 ఉపగ్రహం తయారుచేయడానికి సుమారు రూ.300 కోట్లు ఖర్చవుతుంది. దీని బరువు 640 టన్నులు ఉంటుంది. 43.43 మీటర్ల ఎత్తు ఉంటుంది. వచ్చేనెల ఐదో తేదీన ఆంధ్రప్రదేశ్ లోని సతీశ్ ధావన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (శ్రీహరికోట) నుంచి దీన్ని ప్రయోగిస్తారు. మానవ సహితంగా (వ్యోమగాములతో) ప్రయోగిస్తున్న ఉపగ్రహంగా దీనికి ప్రత్యేకత ఉన్నది.
జీఎస్ఎల్వీ ఎంకే ద్వారా ఆరు సార్లు అంతరిక్షంలోని మానవ సహిత ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ప్రయోగాల్లో విజయవంతం అయితే భారత రాకెట్లను ఉపయోగించి భారత భూభాగం నుంచి అంతరిక్షంలోకి భారతీయులను పంపడం అన్న స్వప్నం సాకారమైనట్లేనని ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ చెప్పారు.
జీఎస్ఎల్వీ ఎంకే జయప్రదమైతే భవిష్యత్లో సిబ్బందిని పంపే చాన్స్
ఎనిమిది టన్నుల బరువైన ఉపగ్రహాన్ని భూ కక్ష్యలోకి పంపగలిగే సామర్థ్యం కలిగి ఉన్న ఎంకే3.. పరీక్ష విజయవంతమైతే.. భవిష్యత్లో సిబ్బందిని సైతం మోసుకెళ్లే అవకాశం ఉంటుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే దశాబ్దం లేదా ఆపై మరికొంత కాలంలో భారతీయ వ్యోమగాములు భారత గడ్డపై భారతీయ ఉపగ్రహవాహక నౌకలో అంతరిక్షంలో కాలుమోపుతారు.
ఇద్దరుగానీ, ముగ్గురు గానీ వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపేందుకు ఉద్దేశించిన మానవ మిషన్కు ఇస్రో ప్రణాళికలు సిద్ధంచేసింది. అందుకు అవసరమైన రూ.26 వేల కోట్ల మంజూరుకు ప్రభుత్వ అనుమతికోసం ఎదురుచూస్తున్నది. ఆ కల సాకారమైతే.. రష్యా, అమెరికా, చైనా తర్వాత ప్రపంచంలో మానవ మిషన్ సాధించిన నాలుగో దేశంగా భారత్ నిలుస్తుంది.
తొలి వ్యోమగామి మహిళ?
మనుషుల్ని అంతరిక్షంలోకి పంపగలిగితే, భారత్ నుంచి వెళ్లే మొదటి వ్యోమగామి మహిళ కావచ్చునని ఇస్రో వర్గాలు చెప్తున్నాయి. ఇస్రో ఇప్పటికే రెండు రకాల ఆపరేషనల్ రాకెట్లను ప్రయోగించింది. 1.5 టన్నుల ఉపగ్రహాలను తీసుకెళ్లే పీఎస్ఎల్వీ శ్రేణితోపాటు, చంద్రయాన్, అంగారక యాత్ర రాకెట్లు ఇందులో ఉన్నాయి. జీఎస్ఎల్వీ ఎంకే-3 విజయవంతమైతే మూడో దశ సాంకేతిక సామర్థ్యాన్ని భారత్ సమకూర్చుకున్నట్లే.
తుక్కు ఇనుముతో జీఎస్ఎల్వీ ఎంకే తయారీ
జీఎస్ఎల్వీ ఎంకే-3ను భారత్లో తుక్కు ఇనుమును ఉపయోగించి తయారు చేశారు. తొలి రాకెట్ల ప్రయోగాల్లో భారత్ ట్రాక్ రికార్డు అంత మంచిగా లేదు. కానీ, తదుపరి రాకెట్లు మాత్రం ఘన విజయాలు సాధించాయి. పీఎస్ఎల్వీ మొదటి రాకెట్ను 1993లో ప్రయోగించగా అది విఫలమైంది. కానీ.. తదుపరి 38 సార్లు దానిని విజయవంతంగా ప్రయోగించారు. జీఎస్ఎల్వీ ఎంకే-1 కూడా 2001లో విఫలమైంది. కానీ, ఆ తర్వాత 11 ప్రయోగాలు జరుగగా, అందులో ఐదు విజయవంతమయ్యాయి.