కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుపై హైకమాండ్ అసహనం: నివేదిక ఇవ్వాలి, పరువు ప్రతిష్ట, ఉప ఎన్నికలు!
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద ఆ పార్టీ కర్ణాటక పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ మండిపడుతున్నారు. పార్టీ సూచించిన ఆదేశాలు లెక్కచెయ్యకుంటే తీవ్రపరిణామాలు ఎదురుచూడాల్సి వస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీ వేణుగోపాల్ హెచ్చరించారు.
కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం: కుమారస్వామి ఇంటికి, యడ్యూరప్ప సీఎం, డేట్ ఫిక్స్, జూన్ లో!
కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న రెండు నియోజక వర్గాల ఇన్ చార్జ్ మంత్రులు ఏం చేస్తున్నారు అని నివేదిక ఇవ్వాలని కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ ను ఆదేశించారని వెలుగు చూసింది. హైకమాండ్ ఆదేశాలు పాటించకుంటే ఎంతటి నాయకుడైనా చూస్తూ వదిలిపెట్టమని కేసీ వేణుగోపాల్ హెచ్చరించారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
10 రోజుల్లో ఉపఎన్నికలు
మే 19వ తేదీన కర్ణాటకలోని కుందగోళ్, చించోళి శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికల కోసం నియమించిన శాసన సభ్యులు ఎన్నికల ప్రచారం చెయ్యకుండా షికార్లు తిరుగుతున్నారని, చెప్పిన మాట వినడం లేదని హైకమాండ్ తో పాటు కేసీ వేణుగోపాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పరువు ప్రతిష్ట
చించోళి, కుందగోళ్ నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండు నియోజక వర్గాల్లో బీజేపీకి దీటుగా ఎన్నికల ప్రచారం చెయ్యాలని కొందరు కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులకు హైకమాండ్ సూచించింది. అయితే శాసన సభ్యులు ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. బీజేపీకి చెందిన మాజీ మంత్రులు, శాసన సభ్యులు రెండు నియోజక వర్గాల్లో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
నివేదిక ఇవ్వండి
కేపీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావ్ కు ఫోన్ చేసిన కేసీ. వేణుగోపాల్ చించోళి, కుందగోళ్ ఉప ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న మంత్రులు, శాసన సభ్యులు ఎవరు అనే జాబితాను పంపించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నికల ప్రచారానికి మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు హాజరుకాలేదు అనే విషయం చెప్పాలని వారికి నోటీసులు జారి చెయ్యాలని, వారు ఏం సమాదానం చెబుతారో ఆ వివరాలు ఢిల్లీకి పంపించాలని దినేష్ గుండూరావ్ కు కేసీ. వేణుగోపాల్ సూచించారని సమాచారం.
మొదటికే మోసం
2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో చించోళి నియోజక వర్గం నుంచి డాక్టర్ ఉమేష్ జాదెవ్, కుందగోళ్ నియోజక వర్గం నుంచి పీఎస్. శివళ్ళి విజయం సాదించారు. మే 19వ తేది జరుగుతున్న రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాదించకుంటే మొదటికే మోసం వస్తోందని ఆ పార్టీ హైకమాండ్ ఆందోళన చెందుతోంది. ఉప ఎన్నికల్లో విజయం సాదించకుంటే పార్టీ పరువు పోయి మొదటికే మోసం వస్తోందని ఆందోళన చెందుతుంది. అందేకే ఇన్ చార్జ్ మంత్రులు, శాసన సభ్యులు ఎన్నికల ప్రచారం చేసే విదంగా కేసీ. వేణుగోపాల్ చర్యలు తీసుకుంటున్నారు.