కొచ్చి మెట్రోను ప్రారంభించిన మోడీ, వెంకయ్య, పినరయితో ప్రయాణం
ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు.ఉదయమే కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ నావెల్ ఎయిర్ స్టేషన్కు చేరుకున్నారు ప్రధాని.
కొచ్చి: ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైలును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ శనివారం ప్రారంభించారు. ఉదయమే కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ నావెల్ ఎయిర్ స్టేషన్కు చేరుకున్నా ప్రధాని... అక్కడి నుంచి పలరివట్టం చేరుకున్నారు. అక్కడ మెట్రో రైలు సేవలను ప్రారంభించిన ప్రధాని మోడీ.. అనంతరం మెట్రోలో ప్రయాణించారు.
ప్రధాని మోడీ వెంట కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, కేరళ గవర్నర్ పి. సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్, 'మెట్రో మ్యాన్' శ్రీధరన్ కూడా మెట్రో రైలులో ప్రయాణించారు. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ప్రజలకు అభివాదం చేస్తూ సందడి చేశారు.
మేక్ ఇన్ ఇండియాను ఈ మెట్రో ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ఇదే రైలులో మోడీ తిరిగి పలరివట్టం చేరుకుని.. అక్కడి జవహార్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మెట్రో ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు.
కాగా, 2013లో కోచి మెట్రో నిర్మాణం ప్రారంభమైంది. వాయు, జల, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానించి దేశంలో ఏర్పాటుచేసిన తొలి మెట్రో రైలు ప్రాజెక్టు ఇదే కావడం విశేషం. మరో విశేషమేంటంటే.. తొలిసారిగా సుమారు 23మంది ట్రాన్స్జెండర్లను కూడా ఇక్కడ సిబ్బందిగా నియమించుకోనున్నారు.