పాక్ చెప్పేసింది: లష్కరే తొయిబాకు చావుదెబ్బ, సర్జికల్ స్టైక్స్లో 20మంది హతం
బారాముల్లా/న్యూఢిల్లీ: భారత సైన్యం అత్యంత పకడ్బందీగా జరిపిన సర్జికల్ దాడుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చావుదెబ్బ తగిలింది. నియంత్రణ రేఖకు ఆవలివైపున పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదుల తాత్కాలిక శిబిరాలపై భారత సైన్యం సెప్టెంబర్ 28న అర్ధరాత్రి మెరపుదాడులు చేసిన విషయం తెలిసిందే.
ఈ దాడుల్లో లష్కరే తోయిబాకు చెందిన కనీసం 20 మంది ఉగ్రవాదులు హతమైనట్లు వివిధ నిఘా వర్గాల నివేదికలను బట్టి తెలుస్తోంది. కాగా, సర్జికల్ దాడులకు సంబంధించి పాకిస్థాన్ అధికారవర్గాల మధ్య జరిగిన వైర్లెస్ సంభాషణలు, సందేశాలు సహా పలు ఇతర వివరాలను అధికారవర్గాలు విశ్లేషించాయి. మెరుపుదాడుల్లో పెద్ద దెబ్బ తగిలింది లష్కరేకేనని తేటతెల్లం చేశాయి.
ఆ అధికారవర్గాల సమాచారం ప్రకారం.. పీవోకేలో మెరుపుదాడులు చేపట్టేందుకు సైన్యం మెరికల్లాంటి ఐదు ప్రత్యేక బృందాలను ఎంపిక చేసింది. ఉత్తర కాశ్మీర్లోని కుప్వారా సెక్టార్కు అభిముఖంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని దూద్నియాల్ వద్ద లష్కరే తోయిబా లాంచ్ప్యాడ్లపై భారత సైన్యం సర్జికల్ దాడులు జరిపింది. కైల్, కేల్గా కూడా పిలిచే ఈ ప్రాంతం నియంత్రణ రేఖపై పాకిస్తాన్ పోస్టుకు 700 మీటర్ల దూరంలో ఉంది.
పాకిస్తాన్ సైన్యం రక్షణలో ఉండే ఈ లాంచ్ప్యాడ్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదులే ఎక్కువగా ఉన్నారు. భారత సైన్యం జరిపిన ఆకస్మిక దాడులతో విస్తుపోయిన ఉగ్రవాదులు పాక్ సైనిక శిబిరంవైపు పరుగులు పెట్టారు కానీ వారు అక్కడికి చేరుకునే లోగానే సైన్యం తన పనిని పూర్తి చేసేసింది. పదిమంది వరకూ ఉగ్రవాదులు కాల్పుల్లో మరణించినట్టు తెలిసింది. తెల్లవారేదాకా ఇక్కడ పాక్ ఆర్మీ వాహనాల కదలిక భారీగా ఉండిందని, మృత దేహాలన్నిటినీ హడావుడిగా తీసుకెళ్లి నీలమ్ వ్యాలీలో సామూహికంగా ఖననం చేసినట్లు తెలుస్తోంది.
ఇక పూంచ్ సెక్టార్కు అభిముఖంగా ఉన్న బాల్నోయ్ ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్లపై కూడా సైన్యం జరిపిన దాడుల్లో లష్కరే తోయిబాకు చెందిన మరో తొమ్మిది మంది ఉగ్రవాదులు హతమైనట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. పాక్ ఆర్మీకి చెందిన 8, నార్తర్న్ లైట్ ఇన్ఫ్రాంట్రీ దళానికి చెందిన ఇద్దరు సైనికులు కూడా ఈ దాడుల్లో చిపోయినట్లు పాక్ ఆర్మీ రేడియో సంభాషణలను బట్టి వెల్లడయిందని ఆ వర్గాలు తెలిపాయి.
అయితే ఉదయం ఎనిమిదిన్నర గంటల తర్వాత రేడియో సంభాషణలు పూర్తిగా ఆగిపోయాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాశ్మీర్, జమ్మూ, ప్రాంతంలోని వివిధ మార్గాలగుండా పెద్ద సంఖ్యలో భారత భూభాగంలోకి చొరబడడానికి ఉగ్రవాదులు వ్యూహరచన చేస్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందిందని, నియంత్రణ రేఖ వద్ద ఒకే చోటికి వీరంతా చేరే దాకా వేచి ఉండిన సైన్యం అదను చూసుకుని చావుదెబ్బ తీసిందని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
ఇప్పటికే పలువురు పాక్ అధికారులు సర్జికల్ దాడులు జరిగాయని చెప్పగా.. ఇప్పుడు ఈ రేడియో సంభాషణలు స్పష్టం చేశాయి. అయితే, పాక్ ప్రధానితోపాటు ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులు, అక్కడి మీడియా మాత్రం సర్జికల్ దాడులు జరగలేదంటూ ఇప్పటికీ బుకాయిస్తుండటం గమనార్హం.