లాక్ డౌన్ ఎఫెక్ట్ .. మల్టీ టాస్కింగ్ పోలీస్ .. ఖాకీల కష్టాలు ఇంతింత కాదయా !!
కరోనా వైరస్ ప్రభావంతో దేశంలో ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఇక లాక్ డౌన్ అమలు చెయ్యాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థపైన ఉంది. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా పోలీసులు రోడ్ల మీద ప్రజల ఆరోగ్య రక్షణ కోసం అహర్నిశలు పని చేస్తున్నారు. అసలే ఎండా కాలం .. ఆపై లాక్ డౌన్ .. కనీసం రోడ్ల మీద మనుషులు కూడా తిరగని పరిస్థితి అందులోనూ ఏదైనా తాగటానికి, తినటానికి కూడా అవకాశం లేకుండా సర్వం బంద్ . ఇక ఇలాంటి సమయంలో ఖాకీలు లాక్ డౌన్ అమలు కోసం నానా తిప్పలు పడుతున్నారు.
24 గంటలు పహారా కాస్తున్న పోలీసులు
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎదురొడ్డి వీరోచితంగా పోరాడుతున్న ఖాకీలపై కొన్ని చోట్ల విమర్శలు వెల్లువగా వస్తున్నా, చాలా వరకు పోలీసులు ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు పడరాని పాట్లు పడుతున్నారు. ఎవరూ బయట తిరగకుండా 24 గంటలు పహారా కాస్తున్నారు. కంటి మీద కునుకు లేకుండా సేవలందిస్తున్నారు. దేశం అంతా లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయితే ప్రజలను రక్షించటానికి పోలీసులు రోడ్ల మీద విధులు నిర్వర్తిస్తున్నారు.
కుటుంబాలకు దూరంగా ఎండను సైతం లెక్క చెయ్యకుండా విధులు
అత్యవసర సర్వీసులలో ఉండే సిబ్బంది అయిన పోలీసులు అత్యంత సాహసోపేతంగా దేశం కోసం, ప్రజల కోసం మీ భద్రత మా బాధ్యత అంటూ సేవలు అందిస్తున్నారు. పోలీసులు కరోనా వైరస్ వల్ల నెలకొన్న లాక్ డౌన్ సమయంలో కుటుంబాలకు దూరంగా ఉంటూ పహారా కాస్తున్నారు. ఎండకు ఎండుతున్నారు . కనీస మౌలిక సదుపాయాలు ఏమీ లేకున్నా విధి నిర్వహణలో వీరోచితంగా పని చేస్తున్నారు. తాగటానికి నీళ్ళు , తినటానికి ఆహారం కూడా దొరకని పరిస్థితులలో కూడా తమ కర్తవ్యాన్ని కొనసాగిస్తున్నారు. చాలా ప్రాంతాలలో పోలీసులు చేస్తున్న కృషిని చూసి స్వచ్చందంగా పలువురు వారికి భోజన వసతి కల్పిస్తున్నారు. వారి శ్రమను కొనియాడుతున్నారు.
రాతి వేళల్లో దోమల బెడద .. కంటి మీద కునుకు లేకుండా కర్తవ్య నిర్వహణ
ఇక రాత్రి సమయాల్లో దోమలు విపరీతంగా ఉండటంతో విధులు నిర్వర్తించలేకపోతున్నారు. ఇక వారి బాధ చూసి దోమతెరలను కొన్ని చోట్ల పోలీసు ఉన్నతాధికారులు అందించటంతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక రాత్రి సమయాల్లో కూడా కంటి మీద కునుకు లేకుండా పని చేస్తున్నారు .ఇక ఇదే సమయంలో విచ్చలవిడిగా వైన్స్ లో జరుగుతున్న చోరీలు, అక్కడక్కడ రోడ్డు ప్రమాదాలు , ఇక గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్న గుడుంబా దందా అరికట్టటం వంటి బాధ్యతలను కూడా పోలీసులు భుజానికెత్తుకున్నారు .
Recommended Video
లాక్ డౌన్ తో పాటు మల్టీ టాస్కింగ్ చేస్తున్న పోలీసులు
లాక్ డౌన్ విధులే కాకుండా వాహన తనిఖీలు కూడా చేస్తూ అక్రమ రవాణాలకు చెక్ పెడుతున్నారు . ఇక అక్కడక్కడ జరుగుతున్న ఘర్షణలు, కుటుంబ కలహాలు , నిత్యావసర సరుకుల బ్లాక్ మార్కెట్ వంటి వాటిపైన కూడా పోలీసులు దృష్టి సారిస్తున్నారు . ఇక కరోనా వైరస్ పై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారి భరతం పడుతున్నారు .ఇన్ని పనులు నిర్వర్తిస్తున్న పోలీసులు ప్రస్తుతం ఒక బృహత్తరమైన బాధ్యత నిర్వహిస్తున్నారు. ఇంతేకాదు చాలా మారుమూల గ్రామాలలో నిత్యావసరాలు, ఆహారం అందకుంటే వారే చొరవ చూపి వారికి ఆహారం , నిత్యావసరాలు అందేలా చూస్తున్నారు . మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ప్రజల్లో కరోనా వైరస్ పట్ల అవగాహన పెంచుతున్నారు . ప్రజల క్షేమమే తమ ధ్యేయం అని సూపర్ పోలీసింగ్ చేస్తున్నారు.