షాక్: పన్నీర్, శశికళ వర్గీయులు ఎత్తులు పై ఎత్తులు? ఫలితంగా ఐటీ దాడులు !
తమిళనాడు దివంగత ముఖ్యంత్రి జయలలిత లేకుంటే అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యింది.
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యంత్రి జయలలిత లేకుంటే అన్నాడీఎంకే పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రజలకు అర్థం అయ్యింది. నిత్యం అమ్మ మాట కాదనకుండా పాదాభివందనం చేస్తూ పార్టీ పదవుల్లో కొనసాగిన నాయకులు ఇప్పుడు ఎవరికి తోచినట్లు వారు వ్యూహాలు పన్నుతున్నారు.
ఎత్తులు పైఎత్తులు వేసుకుంటు లోలోపల ఒకరి మీద ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. అమ్మ జయలలిత ఎంతగానో నమ్మిన పన్నీర్ సెల్వం సీఎంగా ఉన్న సమయంలోనే నెచ్చెలి శశికళను సీఎం చేస్తాం అంటూ బహిరంగంగా మీడియా ముందు చెబుతున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన పార్టీలైన డీఎంకేలో కరుణానిధి మాట ఇప్పటికే ఎవ్వరూ దవజాటరు. అన్నాడీఎంకేలో ఇంత కాలం అమ్మను ఎదిరించి ఎవ్వరూ బట్టకట్టలేదు. అమ్మ జయలలిత మరణించిన తరువాత అన్నాడీఎంకేలో లుకలుకలు మొదలైనాయి.
శశికళ వర్గంలో కొందరు, పన్నీర్ సెల్వం వర్గంలో కొందరు నాయకులు ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. శశికళను సీఎం చెయ్యాలనే నినాదాన్ని అన్నాడీఎంకే అనుబంధ సంస్థ జయలలిత పెరవై తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం సోమవారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.
ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించిన తరువాత అదే రోజు రాత్రి చెన్నై తిరిగి వచ్చేశారు. మంగళవారం సీబీఐ అధికారులు చెన్నై చేరుకుని ఐటీ అధికారుల అదుపులో ఉన్న ఇసుక క్వారీల వ్యాపారవేత్త శేఖర్ రెడ్డిని విచారణ చేశారు. బుధవారం వేకువ జామున తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీ. రామ్మోహన్ రావు ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేశారు.
బుధవారం మద్యాహ్నం తమిళనాడు ప్రభుత్వ సెక్రటేరియట్ లోని రామ్మోహన్ రావు కార్యాలయంలో సోదాలు చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు ఇంటిలో, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదా చేసిన విషయంపై పన్నీర్ సెల్వం ఎలాంటి వ్యాఖ్యలు చెయ్యకుండా మౌనంగా ఉండిపోయారు.
పన్నీర్ సెల్వం తన కార్యాలయంలో అత్యవసరంగా మంత్రులతో సమావేశం అయిన సమయంలోనే పక్కనే ఉన్న రామ్మోహన్ రావ్ కార్యాలయంలో సోదాలు చేశారు. అయితే పన్నీర్ సెల్వం ఐటీ అధికారులతో ఈ విషయంలో ఏమీ మాట్లాడకపోవడం కొసమెరుపు.
రామ్మోహన్ రావు గత నాలుగైదు రోజుల నుంచి శశికళకు మద్దతు ఇస్తున్నారని వార్తలు గుప్పుమన్నాయి. ఇదే సమయంలో పన్నీర్ సెల్వం వర్గీయులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడం వలనే దాడులు జరిగాయని అంటున్నారు. పన్నీర్ సెల్వం ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి.
అయితే జయలలితకు ఆప్తుడైన రామ్మోహన్ రావు పన్నీర్ సెల్వంకు సహకరిస్తున్నారనే అనుమానంతో శశికళ వర్గంలోని మంత్రులు ఐటీ అధికారులకు సమాచారం ఇవ్వడం వలనే దాడులు చేశారని వార్తలు గుప్పుమన్నాయి. మొత్తం మీద అన్నాడీఎంకే నాయకుల మధ్య విభేదాలు రావడం వలనే ఐటీ అధికారులకు సమాచారం అందిందని తెలిసింది.
తమిళనాడు చరిత్రలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇంటిలొ ఐటీ దాడులు జరగలేదని, రాష్ట్రం పరువు తీశారని డీఎంకే కోశాధికారి ఎంకే. స్టాలిన్ మీడియా ముందు అధికార పార్టీ మీద దుమ్మెత్తిపోశారు. మొత్తం మీద అన్నాడీఎంకేలో నాయకుల కుమ్ములాటను ఐటీ అధికారులు వారికి అనుకూలంగా మార్చుకున్నారని సమాచారం.
ఇలాగే ఉంటే అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎంజీఆర్ చనిపోయిన సమయంలో ఇలాంటి పరిస్థితే తలెత్తింది. అప్పుడు నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఎత్తులకు పై ఎత్తులు వేసుకున్నారు.
ఎంజీఆర్ సతీమణి జానకీ రామచంద్రన్ సీఎంగా కనీసం నెలరోజులు కూడా ఉండలేకపోవడంతో ప్రభుత్వం కుప్పకూలిపోయింది. ఇప్పుడు అదే పరిస్థితి తలెత్తితో మా పరిస్థితి ఏమిటీ ? అని అన్నాడీఎంకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.