శశికళ ఫ్యామిలీ వ్యాపారం రూ. 20 వేల కోట్లు: ఎందులోనో తెలిస్తే షాక్ !
చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ ఫ్యామిలీ రికార్డు సృష్టించింది. శశికళ కుటుంబ సభ్యులు నిర్వహిస్తున్న మిడాస్ సంస్థ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి గత 14 ఏళ్లలో రూ. 20 వేల కోట్ల మద్యాపానీయాలు విక్రయించి రికార్డు సృష్టించినట్లు తాజాగా వెలుగు చూసింది.
2001 నుంచి 2006 వరకు కొనసాగిన అన్నాడీఎంకే ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహింస్తుందని సంచలన నిర్ణయం తీసుకుంది. 2003లో ప్రభుత్వం అధికార పూర్వకంగా ఈ నిర్ణయాన్ని తీసుకొంది. తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే కొన్ని నెలల ముందే (2002 అక్టోబర్)లో మిడాస్ గోల్డన్ డిస్ట్రిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుతో కాంచీపురం జిల్లా పడప్పై ప్రాంతంలో మద్య పానీయాల ఉత్పత్తిని ప్రారంభించారు.
శశికళ పక్కా ప్లాన్
తమిళనాడులో ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహించాలని జయలలిత నిర్ణయం తీసుకున్న విషయం శశికళ ముందుగానే పసిగట్టారు. నాగయ్యన్, కిట్టప్ప, అన్బుకరసన్ అనే ముగ్గురు పారిశ్రామికవేత్తల భాగస్వామ్యంతో 2002లో మిడాస్ సంస్థ ప్రారంభం అయ్యింది. 2004లో శశికళ సమీప బంధువులైన కలియపెరుమాల్, కార్తీకేయన్, శశివకుమార్, రావణన్ మిడాస్ సంస్థలో భాగస్వాములైనారు. ప్రస్తుతం శశికళ కుటుంబ సభ్యులకు మిడాస్ సంస్థలో 50 శాతం వాటా ఉంది.
చిన్నమ్మ ప్లాన్ తో దూసుకుపోయారు
శశికళ బంధువులు మిడాస్ సంస్థలొ భాగస్వాములైన అనంతరం టాస్మాక్ సంస్థ (తమిళనాడు మద్యం విక్రయించే దుకాణాలు) ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం చిల్లర దుకాణాలకు అవసరం అయిన మద్య పానీయాలను పూర్తిస్థాయిలో సరఫరా చేసే స్థాయికి మిడాస్ సంస్థ ఎదిగింది. అందుకు శశికళ పక్కా ప్లాన్ వేశారని ప్రచారం జరిగింది. ఒక్క ఏడాదికే మిడాస్ సంస్థ రాకెట్ లా దూసుకుపోయింది.
చెక్ పెట్టిన కరుణానిధి
2006లో తమిళనాడులో జరిగిన శాసన సభ ఎన్నికల్లో డీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో ప్రభుత్వం టాస్మాక్ దుకాణాలకు మిడాస్ సంస్థ నుంచి కొనుగోలు చేసే మద్యపానీయాలను నిలిపివేసింది. డీఎంకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శశికళ బంధువు రావణన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 2007 నుంచి 2011 వరకు మిడాస్ సంస్థ నుంచి టస్మాక్ రూ.2, 773 కోట్ల విలువైన మద్యం కొనుగోలు చేసింది.
శశికళ ఫ్యామిలీ వెనక్కి తిరిగి చూడలేదు
2011లో మళ్లీ అన్నాడీఎంకే అధికారంలోకి రావడంతో మిడాస్ సంస్థ వ్యాపారాలు ఊపందుకున్నాయి. కొత్త బ్రాండ్లతో మద్యపానీయాలు పరిచయం చేశారు. 2011-12లో రూ. 1, 404 కోట్లు, 2012-13లో రూ. 1, 729, 2013-14లో రూ. 2, 280 కోట్లు, 2014-2015లో రూ, 2, 737 కోట్లు, 2015-16లో రూ. 3, 283 కోట్ల మద్యపానీయాలు టాస్మాక్ కు విక్రయించింది. ఐదేళ్లలో మిడాస్ సంస్థ రూ. 11,432 కోట్ల విలువైన మద్యపానీయాలు తమిళనాడు ప్రభుత్వానికి విక్రయించి రికార్డు సృష్టించింది.
చిన్నమ్మ వర్గానికి తిరుగేలేదు
2016లో మళ్లీ అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడంతో మిడాస్ సంస్థ వ్యాపారం రెట్టింపు అయ్యింది. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత అనారోగ్యంతో 75 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో ఉన్న సమయంలో మిడాస్ సంస్థ ఒక్క మొట్టుకూడా కిందకు దిగకుండా తన ఉత్పత్తిని, సరఫరాను తగ్గించకుండా జోరుగా వ్యాపారం చేసింది.
14 ఏళ్లలో రూ. 20 వేల కోట్ల వ్యాపారం !
మద్యపానీయాలు సరఫరా చేస్తున్న సంస్థల్లో మిడాస్ సంస్థ అగ్రస్థానంలో ఉంది. 2016లో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకు మిడాస్ సంస్థ మద్యపానీయాలు రూ. 4, 000 కోట్లకు పైగా విక్రయించింది. గత 14 ఏళ్లలో మిడాస్ సంస్థ సుమారు రూ. 20 వేల కోట్ల విలువైన మద్యాన్ని తమిళనాడు ప్రభుత్వానికి సరఫరా చేసింది. మొత్తం మీద చిన్నమ్మ శశికళ ఫ్యామిలీ తమిళనాడులో మద్యం విక్రయిస్తూ దుసుకుపోతోందని స్పష్టంగా వెలుగు చూసింది.