చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన మంత్రి
బెంగళూరు: ఓ రాష్ట్ర మంత్రి చెరువులోకి దూకి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సంఘటన కర్నాటక జిల్లాలో జరిగింది. మంగళవారం ఉదయం ప్రాథమిక, ఉన్నత విద్యా శాఖ మంత్రి కిమ్మనె రత్నాకర్ తన ఇన్నోవా కారులో తన సొంత ఊరైన తీర్థహల్లి నుండి బెంగళూరుకు వెళ్తున్నారు.
ఈ సమయంలో ఓ మారుతి స్విఫ్ట్ కారు మంత్రి కారును ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయింది. మంత్రి కొద్ది దూరం వెళ్లాక తమను దాటుకుంటూ వెళ్లిన కారు బెగువల్లి చెరువులో మునిగిపోతూ కనిపించింది. కారులో ఆరుగురు కుటుంబ సభ్యులు చిక్కుకుపోయారు.
వెంటనే స్పందించిన మంత్రి రత్నాకర్ తన గన్మెన్, డ్రైవర్, ఎస్కార్టు వాహనం డ్రైవర్లతో కలిసి చెరువులోకి దూకారు. కారులో ఉన్న ఆరుగురు కుటుంబ సభ్యులను రక్షించారు.
డ్రైవర్ చంద్రశేఖర్ ఇతరులతో కలిసి నీళ్లలో మునిగిన కారు తలుపును తెరిచాడు. ముగ్గురు పిల్లలను బయటకు తీసుకు వచ్చాడు. ఆ తర్వాత మిగిలిన మరోసారి వెళ్లి మిగిలిన వారిని తీసుకు వచ్చాడు.
మంత్రి వెంటనే వైద్యుడికి ఫోన్ చేసి పిలిపించారు. వారికి పరీక్షల అనంతరం మందులు, ఫలహారం అన్నింటిని మంత్రి ఏర్పాటు చేశాడు. కాగా, స్టీరింగ్ లాక్ కావడంతో కారు చెరువులోకి వెళ్లిందని వారు చెబుతున్నారు.