కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థి, మాజీ సీఎం 410 ఓట్లతో ఓడారు
ఐజ్వాల్: ఎన్నికలలో ఒక్క ఓటు కూడా చాలా చాలా ముఖ్యం. రెండు దశాబ్దాల క్రితం నాటి ప్రధాని వాజపేయి పార్లమెంటులో ఒక్క ఓటు కారణంగా ఓడిపోయారు. ఇలాగే, ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం, తెలంగాణ, ఛత్తీస్గఢ్లలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వారు కూడా ఉన్నారు.
వందల ఓట్లు, పదుల సంఖ్యలో ఓట్ల తేడాతో ఓడిన వారు ఉన్నారు. మిజోరాంలో ఓ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోయారు. మిజోరం నేషనల్ ఫ్రంట్ (ఎమ్ఎన్ఎఫ్) అభ్యర్థి లాల్చందామ రత్లే త్యూవల్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి మూడు ఓట్ల తేడాతో గెలిచారు.
ఈ ఎన్నికల్లో ఆయనకు 5,207 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ నేత ఆర్ఎల్ పియాంమావియాకి 5,204 ఓట్లు వచ్చాయి. కేవలం మూడు ఓట్ల తేడాతో ఓడిపోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల రీకౌంటింగ్ కోసం డిమాండ్ చేశారు. దీంతో ఎన్నికల సంఘం అందుకు అంగీకరించింది. రీకౌంటింగ్ చేయించింది. అయినప్పటికీ రత్లేకి మూడు ఓట్ల ఆధిక్యం వచ్చినట్లు వెల్లడైంది.
ఆ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిచిన అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎమ్ఎన్ఎఫ్ నేత లాల్రువత్కిమా నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్థిపై 2,720 ఓట్ల తేడాతో గెలిచారు. ఈ ఎన్నికల్లో లాల్రువత్కిమాకి మొత్తం 7,626 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థికి 4,906 ఓట్లు వచ్చాయి.
ఈ ఎన్నికల్లో మిజోరం ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత లాల్ తన్హావ్లా... ఇండిపెండెంట్ అభ్యర్థిపై 410 ఓట్లతో ఓడారు. ఆయనకు 5,071 ఓట్లు రాగా, ఇండిపెండెంట్ అభ్యర్థికి 5,481 ఓట్లు వచ్చాయి. అలాగే, లాల్ తన్హావ్లా... చాంఫై సౌత్ స్థానం నుంచి కూడా పోటీ చేసి 1,049 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ అధినేత, ముఖ్యమంత్రి అభ్యర్థి జోరంతంగా ఐజ్వాల్ తూర్పు 1 స్థానం నుంచి 2,504 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆయనకు మొత్తం 8,358 ఓట్లు రాగా, ఆ స్థానంలో పోటీ చేసిన ఇండిపెండెంట్ అభ్యర్థికి 5,854 ఓట్లు వచ్చాయి.