బెంగాల్లో అరాచకం.. పోలీసులపై తిరగబడ్డ మూక.. రాళ్ల దాడిలో సిబ్బందికి గాయాలు..
కరోనా వైరస్పై పోరులో సైనికుల్లా ముందుండి పోరాడుతున్న వైద్యులు,పోలీసులపై దాడులు జరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పంజాబ్లో విధుల్లో ఉన్న ఏఎస్ఐ హర్జీత్ సింగ్ చెయ్యి నరికేసిన ఘటన దేశంలో కలకలం రేపింది. ఆ అధికారికి మద్దతుగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల పోలీసులు 'మై భీ హర్జీత్ సింగ్' బ్యాడ్జి ధరించి ఆయనకు సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఇలాంటి తరుణంలో పశ్చిమ బెంగాల్లో మరో అవాంఛనీయ ఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులపై కొంతమంది మూక రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయపడ్డారు.
#WATCH: A crowd, which had gathered at a market place in Tikiapara of Howrah today - defying the lockdown, attacked Police personnel & pelted stones at them when they asked the crowd to return to their homes. 2 police personnel injured. #WestBengal (Video source: Amateur video) pic.twitter.com/EAZbm5wWlc
— ANI (@ANI) April 28, 2020
రెడ్ జోన్లో నిబంధనలు బేఖాతరు.. పోలీసుల రంగప్రవేశం..
పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాలో తికియాపారా అనే ప్రాంతాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం.. జనం ఒక్కచోట గుంపుగా చేరకూడదు. కానీ మంగళవారం(ఏప్రిల్ 24) అక్కడి మార్కెట్ ప్రదేశంలో స్థానికులు పెద్ద ఎత్తున గుమిగూడారు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో.. వెంటనే రంగంలోకి దిగారు. సోషల్ డిస్టెన్స్ పాటించాలని,ఒక్కచోట గుంపుగా చేరకూడదని విజ్ఞప్తి చేశారు. అయినా సరే ఎవరూ వినిపించుకోలేదు. దీంతో పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు.
తిరగబడ్డ మూక.. పోలీసులపై దాడి..
ఈ క్రమంలో అక్కడి మూక పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. పోలీస్ వాహనాలను సైతం ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇద్దరు పోలీస్ సిబ్బంది గాయాలపాలయ్యారు. పరిస్థితి అదుపు తప్పడంతో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ రంగంలోకి దిగి మూకను చెదరగొట్టింది. ఇళ్లకు వెళ్లిపోవాలని పోలీసులు చెప్పడమే ఆలస్యం.. ఆ మూక తమపై దాడికి దిగిందని ఓ పోలీస్ అధికారి తెలిపారు. గాయపడ్డ పోలీసులు ఇద్దరు ప్రస్తుతం ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Recommended Video
ఖండించిన తృణమూల్,బీజేపీ..
పోలీసులపై దాడికి పాల్పడ్డవారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ వెల్లడించింది. శాంతి భద్రతలకు భంగం కలిగించే ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేసింది. తృణమూల్ కాంగ్రెస్ నేత,మంత్రి రజీబ్ బెనర్జీ ఘటనను తీవ్రంగా ఖండించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ ఘటనపై బీజేపీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని టార్గెట్ చేసింది. మమతా బెనర్జీ రాజకీయాలకు ధన్యవాదాలని.. ఆమె విశ్వసనీయ ఓటర్లు ఇప్పుడు పోలీసులను కూడా వదలట్లేదని ఎద్దేవా చేశారు. ఇదిలా ఉంటే,ఇప్పటివరకూ బెంగాల్లో 697 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 20 మంది మృతి చెందారు.