యుపి ఉత్కంఠ: వారి ఆశలన్నీ మోదీ మ్యాజిక్పైనే
ఏడు దశలుగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశలో వారణాసి విభిన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణను మరోసారి కమలనాథుల్లో ఆశలు రేపింది.
లక్నో/ న్యూఢిల్లీ: ఏడు దశలుగా సాగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తుది దశలో వారణాసి విభిన్నమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఉన్న ప్రజాదరణను మరోసారి కమలనాథుల్లో ఆశలు రేపింది. ఎలక్షనీరింగ్లో బిజెపి అధ్యక్షుడు అమిత్ షా.. వారణాసి పరిధిలో వ్యూహ రచన అందుకు నిదర్శనంగా మారింది. విజయావకాశాలపై అనుమానాలు వ్యక్తం కావడంతో వారాణాసి పరిధిలో విస్త్రుతస్థాయిలో ప్రచార వ్యూహం అమలు చేశారు.
కాశీ విశ్వనాథుడికి నిలయమైన వారణాసి కేవలం ఎకనమిక్ హబ్ మాత్రమే కాదు. బహుళ సామాజిక వర్గాల ఓటర్లు గల సిటీ. అగ్ర కులాలు బ్రాహ్మణులు, రాజ్పుట్లు, బనియాలు సహా 60 శాతం ఓటర్లు గల ప్రాంతం. ముస్లింల జనాభా 40 శాతంగా ఉంటారు. వారణాసి పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాలపై పూర్తిస్థాయి ద్రుష్టి సారించడంతోనే ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్షోలతో పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు.
ఓబీసీల నుంచి ముస్లింలకు, బ్రాహ్మణుల నుంచి నిషాద్ వరకు అన్ని వర్గాల ప్రజల వరకు స్థానిక ఎంపీగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకడమే దీనికి కారణమంటున్నారు. ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులకు ధీటుగా రాహుల్-అఖిలేశ్ సమరభేరి మోగించారు. కులాల సంకుల సమరం సాగింది. మతోన్మాదమూ తొంగిచూసింది. యూపీతోపాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఐదు రాష్ర్టాల ఫలితాలు ఎక్కువగా ప్రధాని మోదీకి పరీక్ష లాంటివి. ఆయన జనాదరణ, పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రజల స్పందన ఈ ఫలితాల్లో వెల్లడి కాబోతున్నది.
బీజేపీకి వెసులుబాటు ఇలా
యూపీలో బీజేపీ గెలిస్తే ఆ ఘనత అంతా మోదీకే దక్కుతుంది. బీజేపీ ప్రచార భారాన్ని భుజాలపై మోసిన మోదీ సభలకు జనం బాగానే వచ్చారు. యూపీ సీఎం అఖిలేశ్ పట్ల కూడా ప్రజల్లో అభిమానం దండిగానే ఉంది. ఒకవేళ హంగ్ ఏర్పడితే ఇతర పక్షాల మద్దతు సేకరణలో బీజేపీ తన నైపుణ్యం చూపాలి. ప్రధాని మోదీకి ఈ ఎన్నికలు కేవలం గెలువడానికే కాదు 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా కూడా కీలకమే. యూపీ, ఉత్తరాఖండ్తోపాటు గోవా, మణిపూర్ వంటి చిన్న రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే భవిష్యత్లో జరిగే ఎన్నికలకు బలమైన పునాది వేసుకున్నట్టు అవుతుంది. మూడు రాష్ర్టాల్లో గెలిచినా రాజ్యసభలో బలం పెంచుకోవచ్చు. తదుపరి రాష్ట్రపతి ఎన్నికల్లోనూ బీజేపీకి వెసులుబాటు లభిస్తుంది. ఓటమి పాలైతే రాజ్యసభలోనూ, రాష్ట్రపతి ఎన్నికలోనూ అన్నాడీఎంకే, టీఎంసీ వంటి పార్టీలపై ఆధారపడాల్సి వస్తుంది.
మిత్రపక్షాలు దూరమయ్యేందుకు మార్గం
యూపీలో బీజేపీ అద్భుత విజయం సాధించకుంటే రాంవిలాస్ పాశ్వాన్ (లోక్జనశక్తి) ఉపేంద్ర కుష్వాహా (ఆర్ఎల్ఎస్పీ), కొంతకాలంగా చిరచిరలాడుతున్న శివసేన వంటి మిత్రపక్షాలు ఎన్డీయేతో కలిసి సాగడంపై పునరాలోచనలో పడవచ్చు. యూపీలో పోటీ చేయవద్దని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అభ్యర్థన మేరకు ఎన్నికల బరిలోకి దిగకుండా ఊరకుండిపోయిన కేంద్రమంత్రి ఉపేంద్ర కుశ్వాహ తన ఆగ్రహాన్ని బయటపెట్టారు. మోదీ రోడ్ షోల నిర్వహణపై అసహనం వ్యక్తం చేశారు. మోదీకి ఇది తగదన్నారు. ఇక 2014లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. శివసేనను లెక్క చేయడం లేదు. ఇటీవలే జరిగిన బ్రుహన్ ముంబై మహా నగర పాలక సంస్థ (బీఎంసీ) ఎన్నికల్లో శివసేన అతిపెద్ద పార్టీగా నిలవడంతో బిజెపి.. మేయర్ ఎన్నికల్లో భేషరతుగా మద్దతుగా నిలిచింది. భవిష్యత్ లోనూ ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంది.
మణిపూర్లో బీజేపీ గెలిస్తే ఇలా..
మణిపూర్లో బీజేపీ గెలిస్తే పార్టీ ప్రతిష్ఠ మరింతగా ఇనుమడించడమే కాక పార్టీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్కూ మంచి మార్కులు పడతాయి. మాధవ్, హిమంతబిస్వాశర్మ ఉమ్మడి కృషికి గుర్తింపుగా కూడా ఉంటుంది. గోవాలో బీజేపీ గెలిస్తే స్థిర ప్రభుత్వాలను అందించే పార్టీగా బీజేపీకి గుర్తింపు లభిస్తుంది. ఉత్తరాఖండ్లో బీజేపీ అధ్యక్షుడు అమిత్షాకు కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ మొత్తంమీద పరిస్థితి సానుకూలంగానే ఉందంటున్నారు.అయితే రెబెల్స్ పోటీ చేసిన నియోజకవర్గాలే కీలకమని విశ్లేషకులు చెప్తున్నారు.
మోదీ - అమిత్ షా జోడీకి తిరుగుండదిలా..
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గరిష్ఠ విజయాలతో బైటపడితే మోదీ-అమిత్షా జమిలి నాయకత్వానికి పార్టీలో తిరుగు ఉండదు. ఆ పార్టీకి సైద్ధాంతిక మాతృసంస్థగా ఉన్న ఆరెస్సెస్ కూడా వారి నిర్ణయాలను ప్రశ్నించడం మానుకుంటుంది. ఇప్పటివరకు బీజేపీలో అమిత్ షా నిర్ణయాలపై అక్కడక్కడా నిరసనలు వెలువడేవి. కానీ అమిత్ షా ఎన్నికల వ్యూహానికి తిరుగు ఉండదు. పార్టీలో శక్తిమంతమైన అధ్యక్షుడిగా అమిత్ షా నిలిచిపోతారు. ఐదు రాష్ట్రాల ప్రజలు ఎవరి పక్షాన నిలుస్తారన్న విషయం తేలాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే.