NEET 2021: సెప్టెంబర్ 12న పరీక్ష -NTA వెబ్సైట్ ద్వారా రేపటి నుంచే అప్లికేషన్లు -కేంద్రం ప్రకటన
దేశంలో మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకై ఏటా నిర్వహించే 'నేషనల్ ఎలిజిబులిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ -నీట్'కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నీట్ (యూజీ) 2021 పరీక్ష కొత్త తేదీని కేంద్ర విద్య శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సోమవారం వెల్లడించారు. దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహిస్తామని, దానికి సంబంధించిన అప్లికేషన్ల ప్రక్రియ రేపటి(జులై 13) నుంచే ఆరంభమవుతుందని చెప్పారు.
మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 1నే నిర్వహిస్తామని కేంద్రం తొలుత చెప్పినప్పటికీ, కొవిడ్ విలయం నేపథ్యంలో తేదీలను మార్చారు. సెప్టెంబర్ 12న జరగబోయే నీట్ ను కొవిడ్ నిబంధనలను అనుసరించి నిర్వహిస్తామని, అప్లికేషన్ ప్రక్రియ మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) వెబ్సైట్లో ప్రారంభమవుతుందని మంత్రి ప్రధాన్ తెలిపారు.
కరోనా ప్రోటోకాల్స్ ప్రకారం ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ నీట్ 2021 నిర్వహిస్తామన్న మంత్రి ప్రధాన్.. పరీక్ష నిర్వహించే పట్టణాల సంఖ్యను 155 నుంచి 198కి పెంచుతున్నట్టు వెల్లడించారు. అలాగే, గతేడాది 3862గా ఉన్న పరీక్షా కేంద్రాలను కూడా పెంచనున్నట్టు వెల్లడించారు. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులందరికీ మాస్క్లు అందజేయడంతో పాటు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నట్టు ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. నీట్ 2021 ను హిందీ, ఇంగ్లీష్తో పాటు 11 భాషల్లో పెన్ అండ్ పేపర్ పద్ధతిలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు.