ఉగ్రవాది భత్కల్ కోసం ఎన్ఐఏ వేట: 10లక్షల ప్రకటన
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ కోసం నేషనల్ ఇన్వేస్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఏ) వేటను ముమ్మరం చేసింది. భత్కల్ ఆచూకీ చెబితే పది లక్షల రూపాయలు ఇస్తామని ఇటీవల ప్రకటించారు. ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో భత్కల్ ఉన్న విషయం తెలిసిందే. పోలీసు వర్గాల కథనం ప్రకారం.. ప్రస్తుతం భత్కల్ కరాచీలో తలదాచుకుంటున్నాడు.
ఇండియన్ ముజాహిదీన్ వ్యవస్ధాపకుల్లో ఒకడైన రియాజ్ భత్కల్ 2013 ఫిబ్రవరి 21వ తేదీన దిల్సుక్నగర్ బాంబుపేలుళ్ల కేసులో ప్రధాన కుట్రదారు. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందిన విషయం విదితమే. భత్కల్పై ఎన్ఐఏ పోలీసులు చార్జిషీటు కూడా దాఖలు చేశారు.
ప్రస్తుతం భత్కల్ కరాచీలో ఉంటూ ఇండియన్ ముజాహిదీన్, సిరియా ఉగ్రవాద సంస్ధ ఐఎస్ఐఎస్, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్ధ ఆల్ఖైదాలను ఒకే వేదికపైకి తీసుకువచ్చి భారత్ వ్యతిరేకంగా ఉగ్రవాద కార్యకలాపాలను ముమ్మరం చేసేందుకు యువతకు గాలం వేస్తున్నాడు.
హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేంద్రరెడ్డి మాట్లాడుతూ.. ‘భత్కల్పై జాతీయ ఏజన్సీ దర్యాప్తు చేస్తోంది. భత్కల్ దేశంలో లేడు. హైదరాబాద్లో ఉగ్రవాద నిద్రాణ శక్తులు (స్లీపర్ సెల్స్) లేవని చెప్పలేం' అన్నారు. ఇటీవల పట్టుబడిన ఇద్దరు సిమి కార్యకర్తల గురించి ప్రశ్నించగా, హైదరాబాద్లో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఉగ్రవాదులు పాల్పడేందుకు అవకాశాలు లేకుండా పటిష్టమైన భద్రతను, నిఘా వ్యవస్ధలను ఏర్పాటు చేశాం ' అని ఆయన చెప్పారు.
దిల్సుక్నగర్ పేలుళ్ల కేసులో మరో నిందితుడు యాసిన్ భత్కల్ను నిరుడు నేపాల్ సరిహద్దుల్లో అరెస్టు చేసి హైదరాబాద్కు తీసుకువచ్చిన విషయం విదితమే. ప్రస్తుతం యాసిన్ భత్కల్ ఢిల్లీ తీహార్ జైల్లో ఉన్నాడు. రియాజ్ భత్కల్ దేశం వదిలి 2005లోనే దుబాయ్కుపారిపోయాడని, దీనికి కర్నాటక పోలీసుల వైఫల్యమే కారణమని పోలీసు వర్గాలు తెలిపాయి.
రెడ్కార్నర్ నోటీసును ఆలస్యంగా జారీ చేయడం, బెంగళూరులోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్లో ఒక సైంటిస్టు కాల్చి వేత కేసులో పోలీసులు ప్రశ్నించి వదిలేయడం పోలీసుల వ్యూహాత్మక తప్పిదమని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు.