ఢిల్లీలో లాక్డౌన్ ఆలోచన లేదు.. కానీ: అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. వైరస్ నిర్మూలన కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. కఠిన ఆంక్షలను కూడా అమలు చేస్తోంది. కరోనా కేసుల్లో దేశంలోనే ఢిల్లీ మొదటి వరుసలో ఉంది. ముందుగా ఢిల్లీ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. గతేడాది డిసెంబర్లో క్రిస్మస్, న్యూయర్ వేడుకలను రద్దు చేసింది. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విధమైన ఆంక్షలనే అమలు చేసింది.
వీకెండ్ కర్ఫ్యూ..
నిన్నటి నుంచి వీకెండ్ కర్ఫ్యూ అమలు చేస్తోంది. వీకెండ్ వీకెండ్ కర్ఫ్యూ శనివారం ప్రారంభం కాగా సోమవారం ముగియనుంది. కరోనా నియంత్రణ కోసం ఢిల్లీలో ఎన్నో ఆంక్షలు అమలు చేస్తున్నా.. కేసులు అధికంగా వస్తున్నాయి. ఢిల్లీలో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం సాగుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఆదివారం ఉదయం రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఢిల్లీలో ఒకే రోజు కోవిడ్ -19 కేసులు 20 వేల మార్కును దాటాయని తెలిపారు. ప్రస్తుతం లాక్ డౌన్ను అమలు చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని సీఎం చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయని అన్నారు.
ఆశీర్వాదంతోనే..
ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో తాను కరోనా నుంచి కోలుకున్నానని సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు తొందరగానే లక్షణాలు తగ్గినా కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం ఐసోలేషన్లో ఉన్నానని చెప్పారు. లాక్ డౌన్ విధించడం వల్ల అందరూ ఇబ్బందులు పడతారని అన్నారు. లాక్ డౌన్ విధించడం ప్రభుత్వానికి కూడా ఇష్టం లేదని అన్నారు. ప్రజలు కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం ఆలోచించాల్సి వస్తుందని సీఎం తెలిపారు. ప్రజలు మాస్క్ ధరించాలని, భౌతికదూరం పాటించాలని కోరారు. ఇవన్నీ చేస్తే పరిస్థితి మారుతుందని, లాక్ డౌన్ విధించే అవకాశం రాదని చెప్పారు.
మెరుగ్గానే సిచుయేషన్
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ గతేడాది కంటే పరిస్థితి మెరుగ్గానే ఉందని అన్నారు. గతేడాది మే 7వ తేదీన కూడా దాదాపు 20 వేల కేసులు నమోదయ్యాయని తెలిపారు. ఆ రోజున 300 మంది కంటే ఎక్కువగా కరోనా వల్ల మరణించారని అన్నారు, శనివారం కూడా 20 వేల కోవిడ్ కేసులు నమోదయ్యాయని ఏడు మరణాలు సంభవించాయని తెలిపారు.
శనివారం ఇలా
ఢిల్లీలో శనివారం 20,181 కొత్త కోవిడ్ కేసులు వచ్చాయి. కరోనా వల్ల ఏడుగురు మరణించారు. పాజిటివిటీ రేటు 19.60 శాతానికి పెరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. శుక్రవారం 17,335 కేసులు, గురువారం 15,097 కేసులు వెలుగులోకి వచ్చాయి. గత 24 గంటల్లో 1,02,965 పరీక్షలు నిర్వహించారు. దీంతో పరీక్షల సంఖ్య 3,33,87,074కి చేరుకుందని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. కరోనా వల్ల 1,480 మంది రోగులు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. వీరిలో 1308 మంది ఢిల్లీకి చెందిన వారు కాగా, 172 మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. ఇందులో 375 మంది ఆక్సిజన్ సపోర్టుపై బెడ్స్పై, 27 మంది వెంటిలేటర్పై ఉన్నారు. మరో 279 మంది కోవిడ్ రోగులు ఐసీయూలో ఉన్నారు.