ఆ విషయంపై క్లారిటీ ఇస్తేనే కర్తాపూర్ కారిడార్పై పాక్తో చర్చలు: భారత్
ఢిల్లీ: భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధవాతావరణం నెలకొన్న సమయంలోనే కర్తాపూర్ కారిడార్పై తొలిదఫా చర్చలు జరిపాయి రెండు దేశాలు. ఆ తర్వాత రెండో దఫా చర్చలు ఏప్రిల్ 2వ తేదీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో భారత్ ఇందుకు సానుకూలంగా లేదని ప్రభుత్వ అంతర్గత వర్గాల సమాచారం. రెండు దేశాల మధ్య అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాక చర్చలు జరిపే యోచనలో భారత్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే పాకిస్తాన్ నుంచి చర్చలు జరిపేందుకు రానున్న బృందంలో ఖలిస్తాన్ సానుభూతిపరుడు ఒకరు ఉన్నారనే సమాచారం భారత్ వద్ద ఉంది.
మోడీ పై వారణాసి నుంచి పోటీ చేస్తా...ప్రియాంకా గాంధీ వ్యాఖ్యలు దేనికి సంకేతం..?
కర్తాపూర్ కారిడార్ నిర్మాణం కోసం రెండో దఫా చర్చల కోసం కమిటీని ఎంపిక చేశారు పాకిస్తాన్ సమాచారా శాఖ మంత్రి చౌదరి ఫవాద్ హుస్సేన్. ఇందులో దాదాపు 10 మంది సభ్యులున్నారు. వీరిలో ఒకరు ఖలిస్తాన్ సానుభూతిపరుడు గోపాల్ సింగ్ చావ్లా కూడా ఉన్నారు. అయితే చర్చలకు కొందరు వివాదాస్పద వ్యక్తుల పేర్లను పాకిస్తాన్ తమ జాబితాలో చేర్చిందని భారత్ తప్పుబడుతోంది. దీనిపై తాము అభ్యంతరం తెలిపిన భారత్... పాకిస్తాన్ నుంచి స్పందన రాగానే చర్చలపై ఒక నిర్ణయం తీసుకుంటామని భారత విదేశాంగ ఓ ప్రకటనలో తెలిపింది. పాకిస్తాన్ నుంచి క్లారిఫికేషన్ తీసుకునేందుకు భారత్ పాక్ డిప్యూటీ హైకమిషన్ను సంప్రదించినట్లు తెలుస్తోంది.
కర్తాపూర్ కారిడార్ పై చర్చలు జరిపేందుకు వస్తున్న పాక్ బృందంలోని సభ్యులపై సరైన స్పష్టత ఇచ్చేంతవరకు చర్చలు జరపమని భారత్ చెప్పినట్లు తెలుస్తోంది. అదేసమయంలో కర్తాపూర్ విషయంలో వేగవంతమైన పరిష్కారం కోసం భారత్ ఎదురుచూస్తోందని కానీ భద్రతా పరమైన అంశాలపై మీద రాజీ పడబోదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటూ ఖలిస్తాన్ సానుభూతిపరుడు చావ్లా సిక్కుల కోసం ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలంటూ ఉద్యమం చేశాడు. ప్రస్తుతం ఆయన పాకిస్తాన్ సిక్కు గురుద్వారా ప్రబంధక్ కమిటీకి ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు.