భారత్లో ఒబామా పర్యటన: నో టెర్రర్ అంటూ పాక్కు అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ: భారత్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పర్యటన సందర్భంగా పాకిస్ధాన్కు అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ముఖ్య అతిధిగా రాజధాని న్యూఢిల్లీకి ఒబామా వచ్చినప్పుడు భారత్పై ఎలాంటి ఉగ్రవాద దాడులు జరగకుండా చూడాలని పాకిస్ధాన్ను అమెరికా హెచ్చరించింది.
ఈ హెచ్చరికలు ఉల్లంఘించి ఉగ్రవాద దాడులు జరిగి, ఆ దాడులు పాకిస్ధాన్ వైపు నుంచి వచ్చిన వారే చేసినట్లు తేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. భారత్లో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్ వేడుకులకు ముఖ్య అతిధిగా వస్తున్న తొలి అమెరికన్ అధ్యక్షుడు బరాక్ ఒబామా కావడం విశేషం.
రాజ్పథ్లో జరిగే రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్లొంటున్న ఒబామా రెండు గంటల కంటే ఎక్కువ సేపు బహిరంగ వేదికపై ఉంటారు. దీంతో ఆయన భద్రతపై అమెరికా, భారత్ నిఘా సంస్ధలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకల్లో పాల్గొనే ముఖ్య రాజకీయ నేతలకు ఏడు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నాయి.
మార్చి 20, 2000 నాడు అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్ పర్యటనకు వచ్చినప్పుడు జమ్మూ కాశ్మీర్లోని అనంత్ నాగ్ జిల్లాలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు పాకిస్థాన్ను అమెరికా హెచ్చరించింది.
ఆఘ్గనిస్ధాన్లో ఉన్న అమెరికా భద్రతాదళాలు పాకిస్ధాన్లో ఉన్న ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచినట్లు సమాచారం. పాకిస్ధాన్లో ఉన్న అమెరికా ఎంబసీ అధికారులు కూడా పూర్తి అప్రమత్తతో ఉన్నారు.