బై పోల్కు ఆదేశాలు ఇవ్వండి, మోడీకి మమత సెటైర్లు
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోదీపై మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రధాని ఆదేశాల మేరకే ఎన్నికల సంఘం నడుచుకుంటుందని ఆరోపించారు. రాష్ట్రంలో జరగాల్సిన ఎన్నికలు మోదీ ఆదేశిస్తే వెంటనే జరుగుతాయని కామెంట్ చేశారు. దీదీ.. మోడీ, అమిత్ షా లక్ష్యంగా విమర్శలు చేస్తున్నారు. బై పోల్ గురించి కూడా అదే రేంజ్లో ఫైరయ్యారు.
కరోనా తగ్గుముఖం పట్టిందని.. ఏడు రోజుల్లోపు ఉపఎన్నికలు నిర్వహించవచ్చు అని మమతా బెనర్జీ అంటున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇవ్వాలని ప్రధాని మోడీని కోరారు. మోడీ ఆదేశాల మేరకే ఈసీ నడుచుకుంటుందని విన్నానని.. ఇంకెందుకు ఆలస్యం? బెంగాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 30 శాతం ఉండగానే ఎన్నికలు జరిపారని గుర్తుచేశారు. మరీ ఇప్పుడు మూడు శాతం కంటే తక్కువే ఉంది అని సెటైర్లు వేశారు.
గత నెల వచ్చిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ విజయం సాధించిన విషయం తెలిసిందే. దీదీ మాత్రం నందిగ్రామ్లో ఓడిపోయారు. అయినా ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. దీంతో ఆరు నెలల్లోగా ఆమె మరో స్థానం నుంచి గెలుపొందాల్సిన అనివార్యత ఏర్పడింది. అందుకోసమే ఆమె బై పోల్ నిర్వహించాలని కోరుతున్నారు.
వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రభ చూపలేదు. లోక్ సభ ఎన్నికల్లో సీట్లు సాధించగా.. అసెంబ్లీ వరకు వచ్చేసరికి చతికిలబడింది. దీనికి ప్రాంతీయ తత్వం.. అమిత్ షా, జేపీ నడ్డా చేసిన ర్యాలీలు ఉద్రిక్తత తదితర అంశాలు ప్రభావం చూపాయి. బెంగాలీలు చివరికీ దీదీకే పట్టం కట్టారు.