బిజెపిని ధనుమాడి అలసిన ఏఏపీ ఎంపీ, నీళ్లిచ్చిన మోడీ
న్యూఢిల్లీ: లోకసభలో బుధవారం నాడు ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో, నివాసంలో సిబిఐ సోదాల పైన ఏఏపీ మండిపడుతోంది. దీనిని బిజెపి నేతలు, కేంద్రం తిప్పికొడుతోంది.
ఢిల్లీలో ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ కార్యాలయంలో, ఆఫీసులో సీబీఐ సోదాల పైన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యుడు భగవంత్ మన్ లోకసభలో నిరసన తెలిపారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
అతను పెద్ద ఎత్తున బిజెపికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో అతని గొంతు ఎండిపోయింది. కాస్త ఇబ్బంది పడ్డాడు. పక్కనే ఏమైనా మంచి నీళ్లు ఉన్నాయా అని వెతికాడు. లోకసభ సచివాలయ సిబ్బంది టేబుల్ పైన కూడా మంచి నీళ్ల కోసం చూశాడు.
అతడు మంచి నీళ్ల కోసం ఆరాటపడుతుండటాన్ని గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ... నవ్వుతూ తన టేబుల్ పైన ఉన్న మంచి నీళ్లు గ్లాస్ అందించారు. ఆ సమయంలో ప్రధాని మోడీ, ఏఏపీ ఎంపీ భగవంత్ మన్లు పరస్పరం నవ్వేశారు.
సదరు ఏఏపీ ఎంపీ మంచినీళ్లు తాగి ఆ గ్లాస్ను తిరిగి ప్రధాని మోడీ టేబుల్ పైన పెట్టారు. ప్రధాని దాని పైన కవర్ ఉంచారు. ఈ సమయంలో పలువురు బిజెపి ఎంపీలు... ప్రధాని మోడీ చేసిన పనిని అభినందిస్తున్నట్లుగా విక్టరీ సింబల్ చూపించారు. అయితే, భగవంత్ మన్ ఆ తర్వాత తన నినాదాలు కొనసాగించారు.