నా కొడుకే సీఎం.. కాదంటే, తమిళనాడుకు అదో గతే..
కోయంబత్తూర్ : దేశంలో హాట్ టాపిక్ గా మారిన తమిళనాడు ఎన్నికల గురించి నిత్యం ఏదో ఒక వార్త మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంది. బహుశా ఎన్నికల తతంగం మొత్తం పూర్తయ్యేవరకు నేతల కామెంట్స్, ఎన్నికలకు సంబంధించిన ఇతరత్రా విషయాలు జనం నోళ్లలో నానుతుండడం కామనే. ఇదే తరహాలో తమిళనాడులో ఇప్పుడో నేత చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.
ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లా పరిధిలో ఉన్న గౌండంపాళెయంలో ప్రసంగించిన పీఎంకే వ్యవస్థాపకులు రాందాస్.. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో, ప్రజలు తన కుమారుడికి సీఎంగా అవకాశం ఇవ్వకుంటే తమిళనాడును ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, ఈసారి ఎన్నికల్లో తన కుమారుడు అన్భుమణికే పట్టం కట్టాలని తమిళ జనం నిర్ణయించుకున్నారని జనం తరుపున కూడా తానే ఓ స్టేట్ మెంట్ ఇచ్చేశారు.
ప్రచారంలో భాగంగా మరిన్ని విషయాలు వెల్లడించిన రాందాస్.. జయలలిత, కరుణానిధి లాంటి వృద్దుల్లాగా కాకుండా అన్భుమణి లాంటి 35 ఏళ్ల యువకుడు తమిళనాడుకు సీఎం అవబోతున్నాడన్న ఆనందంలో జనం ఉన్నారని తెలిపారు. గడిచిన ఏ ఎన్నికల్లోను యువకులు, మధ్య తరగతి ప్రజలు పెద్దగా ఓట్లు వేయలేదని, కానీ సీఎం బరిలో అన్భుమణి ఉండడంతో చాలామంది ఓటు హక్కు వినియోగించుకోవాలను ఉద్దేశంలో ఉన్నారని చెప్పుకొచ్చారు.
1965 లో పెద్ద ఎత్తున జరిగిన విద్యార్థి ఉద్యమాలతో అప్పటివరకు రాష్ట్రంలో తిరుగులేకుండా ఉన్న కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించి, ప్రజలు ద్రావిడ పార్టీలకు పట్టం కట్టారని.. తాజా ఎన్నికల్లోను డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలను మట్టి కరిపించేలా అన్భుమణి గాలి వీయడం ఖాయమన్నారు.