మూడు ఎకరాల రైతు, రెండు ఎకరాలు వరద బాధితులకు దానం చేశాడు, వీడియో వైరల్!
బెంగళూరు: భారీ వర్షాలు, వరదల కారణంగా కర్ణాటకలోని కొడుగు జిల్లా అతలాకుతలం అయ్యింది. అనేక గ్రామాలు కనుమరుగు కావడంతో స్థానికులు నివాసం ఉండటానికి అవకాశం లేకుండా పోయింది. కొడుగు ప్రాంతంలో నివాసం ఉంటున్న మూడు ఎకరాల యజమాని వరద బాధితులకు రెండు ఎకరాలు దానం చెయ్యడానికి సిద్దం అయ్యారు.
కొడుగు ప్రాంతంలో పూణచ్చ అనే రైతు నివాసం ఉంటున్నాడు. పుణచ్చకు భార్య ఉన్నారు. పూణచ్చకు మూడు ఎకరాల పోలం ఉంది. మూడు ఎకరాల పోలంలో వ్యవసాయం చేసుకుంటూ పూణచ్చ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నాడు.
కొడుగు ప్రాంతంలో భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక ఇండ్లు నేలమట్టం అయ్యాయి. ఆ ప్రాంతంలో మళ్లీ స్థానికులు ఇండ్లు నిర్మించడానికి అధికారులు అవకాశం ఇవ్వడం లేదు. భారీ వర్షాలు, వరదలు మళ్లీ వస్తే ఈ ప్రాంతాలు జలమయం అయిపోతాయని, పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.
NO WORDS TO SAY: Poonacha of Kodagu owns three acres of land out of which he is donating two acres to flood-affected families. #BigSalute #KodaguFloodRelief pic.twitter.com/aNbuoTZOcw
— Kodagu Connect (@KodaguConnect) August 26, 2018
వరద బాధితులు ఇండ్లు నిర్మించుకోవడానికి తనకు ఉన్న మూడు ఎకరాల్లో రెండు ఎకరాలు ఉచితంగా మనస్పూర్తిగా ఇవ్వడానికి తాను సిద్దంగా ఉన్నానని పూణచ్చ అంటున్నారు. పూణచ్చ ఆయన భార్యతో కలిసి మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మాకు పిల్లలు (సంతానం) లేరు. ఒక ఎకరా భూమిలో వ్యవసాయం చేసుకుని మేము సంతోషంగా జీవిస్తామని, రెండు ఎకరాలలో వరద బాధితులు ఇండ్లు నిర్మించుకోవడానికి ఇవ్వడానికి తాము సిద్దంగా ఉన్నామని చెప్పారు. పూణచ్చకు ఆయన భార్య సంపూర్ణ మద్దతు ఇచ్చారు.
రెండు ఎకరాలు భూమి దానం చెయ్యడానికి తనకు ఇష్టమే అని పూణచ్చ భార్య స్పష్టం చేశారు. అంతే కాకుండా వరదల్లో తల్లిదండ్రులు మరణించి ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే మాకు ఇస్తే వారిని సుఖంగా పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేస్తామని పూణచ్చ దంపతులు మనవి చేశారు. పూణచ్చ దంపతుల దాన గుణం తెలుసుకున్న అనేక మంది వారిని అభినందిస్తున్నారు.