ఆర్ టీసీ డిపోలో దెయ్యాలు: క్షుద్ర పూజలు
కాసరగోడ్: కేరళలోని ఓ ఆర్ టీసీ డిపోలో దెయ్యాలు తిరుగుతున్నాయని ఆందోళన చెందిన అక్కడి అధికారులు, సిబ్బంది వాటిని తరిమేయడానికి క్షుద్ర పూజలు చేయించి అడ్డంగా బుక్కయ్యారు. అసలు క్షుద్ర పూజలు ఎందుకు చేశారో వివరణ ఇవ్వాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
కాసరగోడ్ జిల్లా (కేరళ-కర్ణాటక సరిహద్దు)లోని ఓ ఆర్ టీసీ డిపోలో దెయ్యాలు సంచరిస్తున్నాయని అధికారులు, సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. దెయ్యాలను తరిమేయ్యడానికి ఇదే సంవత్సరం అక్టోబర్ 22వ తేదిన డిపోలో క్షుద్ర పూజలు చేయించారు.
ఆ సందర్బంలో పూజలు చేస్తున్న ఓ వ్యక్తి ఆ దృశ్యాలను వీడియో తీశారు. ఇటివల ఆ వీడియో బయటపడింది. కేరళలోని పలు టీవీ చానెళ్లలో ప్రసారం అయ్యాయి. ఈ విషయంపై వెంటనే విచారణ జరిపించాలని పలువురు డిమాండ్ చేశారు.
డిపోలో పూజలు జరిగిన విషయంపై దర్యాప్తు చెయ్యాలని విజిలెన్స్ అధికారులను కేఎస్ ఆర్టీసీ సీఎండీ ఆంటోని చాకో ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అయితే తాము ఆయుధ పూజలు మాత్రమే చేశామని కావాలనే ఎవరో లేనిపోని వివాదం సృష్టించడానికి ఈ విదంగా చేశారని డిపో అధికారులు అంటున్నారు. పూజలు చేసిన సమయంలో జిల్లా రవాణా శాఖ అధికారి అక్కడే ఉన్నారని చెబుతున్నారు.
ఆయుధ పూజలు ఆపడం మా వల్లకాదని అధికారులు అన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని, దెయ్యాలు తిరుగుతున్నాయని ఆరోపిస్తూ ఓ తాంత్రికుడితో క్షుద్ర పూజలు చేయించారని అదే డిపోలో పని చేస్తున్న ఓ డ్రైవర్ అంటున్నాడు.