చెన్నైలో మళ్లీ వర్షాలు, అధికారులు అలర్ట్, సెలవులు, హడలిపోతున్న ప్రజలు, మూడు రోజులు !
చెన్నైలో మళ్లీ వర్షాలు మొదలైనాయి. ఆదివారం నుంచి చెన్నై నగరంతో సహ కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి.
చెన్నై: చెన్నైలో మళ్లీ వర్షాలు మొదలైనాయి. ఆదివారం నుంచి చెన్నై నగరంతో సహ కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో మోస్తారు వర్షాలు పడుతున్నాయి. వర్షాల కారణంగా చెన్నై నగరంతో పాటు కాంచీపురం, తిరువల్లూరు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
తమిళనాడులోని సముద్ర తీర జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ బీ. ఉదయ్ కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు పడితే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడటానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని చెప్పారు.
చెన్నై నగరంలో వర్షం నీరు రోడ్ల మీద నిల్వకాకుండా చూడటానికి గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది సర్వం సిద్దం చేశారని మంత్రి ఉదయ్ కుమార్ అన్నారు. రెస్యూ టీం సభ్యులు నిత్యం అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఆదేశించామని మంత్రి ఉదయ్ కుమార్ వివరించారు.
చెన్నైలో మళ్లీ వర్షాలు మొదలు కావడంతో స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. బుధవారం వరకూ చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు తదితర ఐదు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. చెన్నై నగరంలోనే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడంతో తమిళనాడు ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.