చిరుతపులి కలకలం: వారం రోజులుగా స్కూల్లోనే, బోనులో చిక్కకుండా చక్కర్లు
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రం కోటాలోని ఓ పాఠశాలలో చిరుతపులి మకాం వేయడం స్థానికంగా భయాందోళనలకు కారణమవుతోంది. వారం రోజుల నుంచి పాఠశాలను వీడకపోవడంతో పాఠశాల విద్యార్థులకు కమ్యూనిటీ హాల్స్లో విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో రణథంబోర్ నేషనల్ పార్క్(ఆర్ఎన్పీ) నుంచి ఓ బృందం ఆ పాఠశాలకు వద్దకు చేరుకుంది. మంగళవారం నుంచి పులిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. రాత్రి వరకు కూడా పులిని బయటకు తీసుకొచ్చేందుకు యత్నించారు. అయితే, పులి బయటకు రాకపోవడంతో భవనం వద్దే ఆ బృందం వేచిచూస్తోంది.
మరోవైపు, అటవీశాఖ అధికారులు కూడా పాఠశాల ప్రాంగణంలో కెమెరాలను అమర్చి పులి కదలికలను తెలుసుకుంటున్నారు. బయటకు వస్తే బంధించేందుకు బోనులను కూడా ఏర్పాటు చేశారు. మత్తు ఇంజెక్షన్ చేసి పట్టుకోవాలని ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.
బోన్లు ఏర్పాటు చేసినప్పటికీ ఆ తెలివైన చిరుతపులి చిక్కకుండా తిరుగుతోందని అధికారులు చెబుతున్నారు. స్థానికులు కూడా తమ సిబ్బందికి ఆటంకాలు కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పులిని సురక్షితంగా బయటకి తీసుకొచ్చేందుకే తాము యత్నిస్తున్నట్లు వెల్లడించారు.
చుట్టుపక్కల ఇళ్లవారు తమ ఇళ్లల్లోకి చిరుత రాకూడదని బిగ్గరగా సంగీతం పెడుతున్నారు. దీంతో ఆ చిరుత కొంత గందరగోళానికి గురవుతోంది. పరిసర ప్రాంతాలు నిశ్శబ్ధంగా ఉంటే.. చిరుత బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో తాము సురక్షితంగా చిరుతను పట్టుకోగలమని అధికారులు చెబుతున్నారు.