ఆర్ కే నగర్ ఎమ్మెల్యే టీటీవీ దినకరన్ పదవికి ఎసరు, రూ. 20 నోట్ల దెబ్బ, అరెస్టుతో?
Recommended Video
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రాతినిధ్యం వహించి ఆమె మరణంతో ఖాళీ అయ్యి ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ప్రతిపక్షం డీఎంకే పార్టీలను వెనక్కి నెట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
ఉప ఎన్నికల్లో !
ఆర్ కే నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన టీటీవీ దినకరన్ అనేక జిమ్మిక్కులు చేసి ప్రచారం చేశారు. తన మద్దతుదారులను అనేక విధాలుగా ఉపయోగించుకున్న టీటీవీ దినకరన్ ఓటర్లకు వల వేశారు.
అన్నాడీఎంకే, డీఎంకేలతో !
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే, ఆ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయిన డీఎంకే పార్టీలకు పోటీగా టీటీవీ దినకరన్ ఆర్ కే నగర్ ఉప ఎన్నికల బరిలో దిగి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న రెండు పార్టీలకు చుక్కలు చూపించి విజయం సాదించారు.
రూ. 20 నోట్లు వల
రూ. 20 నోట్లు మీద రహస్య కోడ్ వేసి ఆర్ కే నగర్ ఓటర్లకు పంచిపెట్టిన టీటీవీ దినకరన్ వర్గీయులు మా నాయకుడికి ఓటు వేసిన తరువాత తిరిగి ఆ నోటు చెల్లిస్తే రూ. 6 వేల నుంచి రూ. 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది.
తిరగబడిన ఓటర్లు
రూ. 20 నోట్లు తీసుకుని మీరు చెప్పిన నగదు ఇవ్వాలని ఆర్ కే నగర్ ఓటర్లు టీటీవీ దినకరన్ వర్గీయులకు చెప్పారు. అయితే ఉప ఎన్నికల్లో టీటీవీ దినకరన్ విజయం సాధించిన తరువాత వారు చేతులు ఎత్తేశారు. ఇప్పుడు ఓటర్లు తిరగబడటంతో టీటీవీ దినకరన్ వర్గీయులు మాయం అయ్యారు.
అరెస్టుతో ప్లాన్ రివర్స్ ?
రూ. 20 నోట్లు పంచిపెట్టి ఓటర్లను లొంగదీసుకున్నారని ఆరోపిస్తూ టీటీవీ దినకరన్ వర్గీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఆర్ కే నగర్ ఓటర్లకు నగదు పంచిపెట్టారని అరెస్టు అయిన వారు అంగీకరిస్తే చట్టపరంగా టీటీవీ దినకరన్ ఎమ్మెల్యే పదవికి ఎసరు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తం మీద అరెస్టు అయిన వారు ఏం చెబుతారో అంటూ టీటీవీ దినకరన్ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.