సాయిబాబా: స్వరూపపై కేసు, బాధపడ్డ మోహన్బాబు
ముంబై: షిరిడీ సాయిబాబా పైన వ్యాఖ్యలు చేసిన స్వరూపానంద పైన సాయి భక్తుడు ఒకరు మంగళవారం ఫిర్యాదు చేశారు. నితిన్ కోటే అనే సాయి భక్తుడు మహారాష్ట్రలోని షిరిడీ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
కాగా, సాయిబాబా విషయంలో ద్వారకాపీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద వివాదాస్పదమైన వ్యాఖ్య చేసిన విషయం తెలిసిందే. సాయిబాబా దేవుడు కాడని, సాయిబాబాను ప్రార్థించవద్దని ఆయన సోమవారం అన్నారు. హిందువులను విభజించడానికే సాయిబాబాకు పూజలు చేయడమనేది వచ్చిందని ఆయన అన్నారు.
సాయిబాబా మానవుడు మాత్రమేనని, దేవుడు కాడని, అందువల్ల ప్రార్థించవద్దని ఆయన అన్నారు. సాయిబాబాకు గుడులు కూడా కట్టవద్దని ఆయన అన్నారు అది డబ్బులు చేసుకుంటున్న కొన్ని విదేశీ సంస్థల కుట్ర అని ఆయన అన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.
హిందూముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, అందువల్ల సాయిబాబా విష్ణువు అవతారం కాదని ఆయన అన్నారు.
సాయిబాబాను గురువుగా గానీ ఆదర్శపురుషుడిగా గానీ పరిగణించకూడదని ఆయన అన్నారు. సాయిబాబా మాంసాహారి అని ఆయన అన్నారు. మరోవైపు మంగళవారం ఉదయం స్వరూపానంద మాట్లాడుతూ.. సాయిబాబా విషయంలో తర్కబద్ధమైన చర్చ జరగాలన్నారు.
మోహన్ బాబు ఆవేదన
సాయిబాబా దేవుడు కాదన్న వ్యాఖ్యల పైన ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. సాయిని ద్వేషించడం బాధాకరమన్నారు. సాయి దేవుడు కాదన్న మాటలతో తాను ఎంతో ఆవేదన చెందానన్నారు. ఈశ్వరుని ప్రతిరూపమే సాయి అన్నారు. సాయిని దర్శించుకుంటే సకలశుభాలు కలుగుతాయన్నారు.