ఈ రోజు ఇది, రేపు మరొకటి: పన్నీరుసెల్వంపై శశికళ నిప్పులు
అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
చెన్నై: అక్రమాస్తుల కేసులో బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్న అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మాజీ ముఖ్యమంత్రి పన్నీరుసెల్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే ఇరువర్గాల విలీనానికి పన్నీరు డిమాండ్లు పెట్టడంపై మండిపడ్డారు.
ఈ రోజు తన రాజీనామాను అడిగిన పన్నీరుసెల్వం రేపు తన ఆస్తుల చిట్టాను కూడా అడుగుతారని ఆవేదన వ్యక్తం చేశారని తెలుస్తోంది. పార్టీలోని ఇరువర్గాలు విలీనం అయ్యేందుకు పన్నీరుసెల్వం వర్గం సీఎం పళనిస్వామి వర్గం ముందు పలు డిమాండ్లు పెట్టిన విషయం తెలిసిందే.
సీఎం పదవిపై పళని ససేమీరా, దాటవేత: కేంద్రంపై వీరమణి సంచలనం
శశికళ, దినకరన్ సహా పార్టీలో ముప్పై మంది వరకు మన్నార్గుడి ఫ్యామిలీ ఉందని, వారంతా పార్టీ నుంచి తొలగించాలని పన్నీరువర్గం డిమాండ్ చేసింది. దీనిని శశికళ తప్పుబట్టారు. శశికళ జైలుకు వెళ్లినప్పుడు జయలలిత స్మారకం వద్ద చేయి కొట్టి ప్రమాణం చేసిన విషయం తెలిసిందే.
ఇప్పుడు అంతకంటే ఆవేదనతో, ఆగ్రహంతో శశికళ.. పన్నీరుపై ఉన్నారని తెలుస్తోంది. పన్నీరుసెల్వం అంతా స్వార్థంతో పని చేస్తున్నారని, ఇష్టారీతిన డిమాండ్లు పెడుతున్నారని ఆమె ఆగ్రహించారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతికి శశికళనే కారణమని పన్నీరుసెల్వం వర్గం నేత పొన్నియన్ మరోసారి ఆరోపించారు. పోయెస్ గార్డెన్లోని ఇంట్లో జయలలితను నెట్టివేశారన్నారు.