వ్యాపారిపై తల్వార్తో దాడి: కాపాడిన కస్టమర్(వీడియో)
ముంబై: వికలాంగుడైన ఓ దుకాణదారుపై దుండగుడు తల్వార్ తో దాడికి పాల్పడ్డాడు. కాగా, దుకాణంలో ఏదో కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్ ఆ దుండగుడ్ని అడ్డుకుని వ్యాపారి ప్రాణాలు కాపాడాడు.
దుండగుడ్ని పట్టుకున్న కస్టమర్.. కేకలు వేయడంతో స్థానికులందరూ అక్కడికి చేరుకున్నారు. అతడ్ని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన ముంబైలోని చెంబూరు ప్రాంతంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.
సుమారు 200మంది వ్యాపారులు ఉంటున్న ఆ ప్రాంతంలో ఇలాంటి అప్పుడప్పుడూ చోటు చేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. గుండాల బెడద ఎక్కువగా ఉందని వాపోతున్నారు.
కాగా, దుండగుడు తల్వార్తో వ్యాపారిపై చేయడం, కస్టమర్ దుండగుడ్ని అడ్డుకుని కాపాడటం మొత్తం ఆ దుకాణంలో ఏర్పాటు చేసిన సిసికెమెరాల్లో రికార్డైంది. ఆ కస్టమర్ ప్రాణాలకు తెగించి దుండగుడ్ని అడ్డుకోవడంతో వ్యాపారి రజ్నీష్ సింగ్ థాకూర్(36) అలియాస్ బబ్లూ ప్రాణాలతో బయటపడ్డాడు.
దుండగుడి దాడిలో బబ్లూ మెడ, ఎడమ చేయికి గాయాలయ్యాయి. వెంటనే అతడ్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. కాగా, దాడి చేసిన నిందితుడు షేక్ను పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యాపారి ప్రాణాలు కాపాడిన కస్టమర్ను బబ్లూ కుటుంబసభ్యలు, స్థానికులు అభినందించారు. ఆ కస్టమర్ లేకుండి ఉంటే తన సోదరుడి ప్రాణాలు దక్కేవి కాదని బబ్లూ సోదరుడు మనీష్ తెలిపారు.
దాడి చేసిన షేక్ తోపాటు వచ్చిన మరో ఐదుగురు దుండగులు పరారయ్యారు. విస్తృతంగా గాలించిన పోలీసులు అందులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల ముఠాకు చెందిన వారే ఈ దాడులకు పాల్పడుతున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు. ఈ గుండాల నుంచి రక్షణ కల్పించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు