రూ.2 వేల నోటులో ప్రధాని మోడీ బ్లాక్ మనీ సందేశం
నల్ల ధనం పైన ప్రధాని మోడీ సందేశాన్ని రూ.2 వేల నోటు సహాయంతో వీక్షించే యాప్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'మోడీ కీ నోట్' యాప్ డౌన్ లోడ్ చేసుకొని వినొచ్చు.
బెంగళూరు: నల్ల ధనం పైన ప్రధాని నరేంద్ర మోడీ సందేశాన్ని రూ.2 వేల నోటు సహాయంతో వీక్షించే యాప్ అందుబాటులోకి వచ్చింది. స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి 'మోడీ కీ నోట్' యాప్ డౌన్ లోడ్ చేసుకొని రూ.2వేల నోటుకు వెనుక వైపు ఉన్న ఉపగ్ర చిత్రాన్ని స్కాన్ చేస్తే మోడీ సందేశం ప్రసారమవుతుంది.
ఇది రూ.2వేల నోటు పైననే ప్రసారం అవుతుంది. ఈ యాప్ను బెంగళూరుకు చెందిన ఓ స్టార్టప్ సంస్థ అభివృద్ధి చేసింది. బారా స్కల్ స్టూడియో అనే స్టార్టప్ కంపెనీ దీనిని తీసుకు వచ్చింది. ఐఓఎస్ యూజర్లకు ఉపయోగపడే యాప్ కూడా వస్తుందా లేదా తెలియాల్సి ఉంది. కాగా, ఈ యాప్ను ఇప్పటికే వేలాది మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.
కాగా, రద్దయిన పెద్ద నోట్లను సహకార బ్యాంకుల్లో జమ లేదా మార్పిడికి అనుమతించాలని సూరత్లో రైతులు పెద్దఎత్తున డిమాండ్ చేశారు. సహకార బ్యాంకులకు అనుమతించకుండా ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శనివారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
వారం రోజుల్లో ఈ నిబంధనను ఎత్తివేయకపోతే అమూల్ సహకార సంస్థకు పాల సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన రైతులు, వ్యవసాయ ఉత్పత్తులతో 150 ట్రాక్టర్లు, 100 ట్రక్కుల్లో 10కి.మీ.ల మేర ప్రదర్శన నిర్వహించారు.
కలెక్టర్కు వినతిపత్రం సమర్పించి, కార్యాలయం బయట ధాన్యం, పాలను రోడ్డు మీద పారబోశారు. చాలామేర రైతుల ఖాతాలన్నీ జిల్లా సహకార బ్యాంకుల్లోనే ఉన్నాయని, ఆర్బీఐ నిర్ణయం వారందరినీ తీవ్రంగా దెబ్బ తీసిందని రైతు నేత, సూరత్ జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం (సుమూల్) మాజీ అధ్యక్షుడు జయేష్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు స్థానిక కాంగ్రెస్ నేతలు మద్దతు తెలిపారు.