రోహతక్ అక్కాచెల్లెళ్ల వీడియోలు: కొత్త ట్విస్ట్లు
రోహతక్: హర్యానా రాష్ట్రంలోని రోహతక్కు చెందిన అక్కాచెల్లెళ్లు.. బస్సులో తమను వేధిస్తున్న ముగ్గురు యువకులను, పార్క్లో మరో యువకుడిని చితకబాదిన విషయం ఇటీవల సంచలనం సృష్టంచిన విషయం తెలిసిందే. ఆ అక్కాచెల్లెళ్ల వీడియోల పైన పలువురు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, బస్సులో దెబ్బలు తిన్న యువకులకు వారి గ్రామస్తులు అంగా నిలుస్తున్నారు. ఈ అక్కాచెల్లెళ్లను యువకులు వేధించడం, వారిని వీరు కొట్టడం, అవే వీడియోలు బయటకు వస్తుండటం పైన పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయం మలుపుల మీద మలుపులు తిరుగుతోంది.
అదే బస్సులో ప్రయాణిస్తున్న ఆరుగురు మహిళలు దెబ్బలు తిన్న యువకులకు బాసటగా నిలిచారు. ఈ ఘటనలో ముగ్గురు యువకుల తప్పు ఏమీ లేదని వారు పోలీసులకు చెప్పారని తెలుస్తోంది. నిందితులు, బాధితులు, ఇప్పుడు పోలీసులకు సాక్ష్యం చెప్పిన వారిలో ముగ్గురు ఒకే గ్రామానికి చెందిన వారు.
ఇప్పటికే గ్రామస్తులు పలువురు యువకులకు అండగా నిలబడ్డ విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల వర్షన్ పైన గ్రామస్థులు అఫిడవిట్ దాఖలు చేశారు. యువకుల తప్పు లేదని, అక్కాచెల్లెళ్లదే తప్పు అని పేర్కొన్నారు.
సోనాలి అనే మహిళ ప్రకారం.. అక్కాచెల్లెల్లు బస్సులో ఉన్న ఓ మహిళతో మాట్లాడుతుండగా తాను విన్నానని, తమకు మద్దతివ్వాలని, అలాగే ఫోన్ ద్వారా వీడియో తీయాలని, దానికి ఆమె అంగీకరించారని తెలిపింది. కాగా, రోహతక్ అక్కాచెల్లెళ్ల వీడియోలు ఇటీవల ఇంటర్నెట్లో హల్ చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అక్కాచెల్లెళ్ల పేరు ఆర్తి, పూజ.
అడ్డుకున్నాను: కండక్టర్
రోహతక్ ఘటన పైన సస్పెండైన బస్సు కండక్టర్ మాట్లాడుతూ.. తాను ఆపాలని చూశానని, పలుమార్లు వారికి వార్నింగ్ ఇచ్చానని ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అవసరమైతే బస్సును పోలీసు స్టేషన్కు తీసుకు వెళ్తానని హెచ్చరించానని చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి డ్రైవర్, కండక్టర్ను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
నగదు బహుమతిని నిలిపివేసిన హర్యానా ప్రభుత్వం!
అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ పూజా, ఆర్తీలకు ప్రకటించిన నగదు పురస్కారాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు హర్యానా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అక్కాచెల్లెళ్ళ ప్రవర్తనపై పలు సందేహాలు ఉన్నాయని, తమకు కొట్టడం అలవాటని వాళ్ళే స్వయంగా ఒప్పుకున్నారని, వీరు చెబుతున్న విషయాల్లో ఉన్న అనుమానాలు నివృత్తి చేసుకునేంత వరకూ బహుమతి నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.